ఆప్తులు కాబట్టే మౌనమా ? విజయవాడ అగ్నిప్రమాదంపై చంద్రబాబు తీరును తప్పుబట్టిన శ్రీకాంత్రెడ్డి
విజయవాడ స్వర్ణప్యాలెస్ హోటల్లో రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది చనిపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని వైసీపీ నేత, ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నిర్వహించే జూమ్ యాప్ కాన్ఫరెన్సుల్లో పాల్గొనే రమేశ్ చౌదరి నిర్లక్ష్యం వల్లే విజయవాడలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
ప్రతీ అంశాన్ని కులంతో ముడిపెట్టి రాద్ధాంతం చేసే చంద్రబాబు... రమేశ్ చౌదరి విషయంలో ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. మీ పార్టీకి సంబంధించిన వాళ్లు చేస్తే ఒకరకంగా, ఇతరులు చేస్తే ఒకరకంగా స్పందించడం చంద్రబాబు నైజమని, దాన్ని బయటపెట్టేందుకే తాము ప్రయత్నిస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఓ పార్టీకి అధ్యక్షుడుగా పనిచేసే వ్యక్తి ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరించరాదన్నారు. అందరికీ అతీతంగా వ్యవహరించినప్పుడే మనం నాయకులం అవుతాం. అలాంటి ఉద్దేశం నీకే కోశానా లేదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు తెలిసిందల్లా ప్రతిదానికీ కుల రాజకీయాలు చేయడమే అన్నారు. గతంలో తప్పు చేసిన వాళ్లను శిక్షించినా చంద్రబాబు కుల ప్రస్తావన తెచ్చారని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. స్వయానా టీడీపీ వాళ్లే బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీలపైన దాడిచేసినా అందుకు ప్రభుత్వానిదే తప్పంటారని, ఈ రెండు నాల్కల ధోరణి మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు.
రాష్ట్రం నడిబొడ్డున జరిగిన విజయవాడ అగ్నిప్రమాద ఘటనలో ఫలానా వ్యక్తులది తప్పని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని, ఆయన ఉద్దేశాలన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయని శ్రీకాంత్ ఆక్షేపించారు. ఎలాగూ రాజకీయ భవిష్యత్తు లేదని భావించి, ఆ జూమ్ యాప్ ద్వారా లేనిపోనివి ఏదో ఒకటి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. విజయవాడ ఘటనపై కమిటీ వేయడమే కాకుండా ఎక్స్ గ్రేషియా రూ.50 లక్షలు కూడా ప్రకటించామని, కమిటీ నివేదిక వచ్చాక కారకులపై కఠినచర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.