రాహుల్కు విజయసాయి రెడ్డి కీలక సూచన - తల్లి, చెల్లి: అలా చేస్తేనే జాతి గర్విస్తుంది..!!
బెంగళూరు: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర- ఇవ్వాళ పునఃప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటకలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ ఉదయం తుమకూరు జిల్లాలోని మయసంద్రలో యాత్రను చేపట్టారాయన. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. మొత్తంగా కర్ణాటకలో 511 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగనుంది.
ఉత్సాహం డబుల్..
ఈ యాత్రలో ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ పాల్గొనడం పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్టయింది. రెండు రోజుల కిందటే ఆమె రాహుల్తో కలిసి పాదయాత్ర చేశారు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పలువురు నాయకులు ఇదివరకే సోనియా గాంధీ-రాహుల్తో కలిసి జోడో యాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలికారు.
ఫొటోలు వైరల్..
రాహుల్ గాంధీ పాదయాత్ర ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇదివరకు ఆయన మైసూరులో భారీ వర్షంలో ప్రసంగించడం, ఆ తరువాత సోనియాగాంధీ షూ లేస్ను కడుతున్న ఫొటో ఓ ఊపు ఊపింది. దీని మీద చాలామంది రియాక్ట్ అయ్యారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అయిందీ పిక్. రాహుల్ గాంధీ రాటుదేలుతున్నాడంటూ చాలామంది కామెంట్స్ పెట్టారు.
భారత్ జోడో యాత్ర అంటే..
దీనిపై తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి స్పందించారు. తల్లీ, చెల్లీ మాత్రమే కాదు, ప్రజలంతా తన కుటుంబసభ్యులేనని రాహుల్ గాంధీ భావించినప్పుడే అది భారత్ జోడో యాత్ర అవుతుందని పేర్కొన్నారు. కోవిడ్, ఇతర అనారోగ్య సమస్యల వల్ల సోనియా గాంధీ చాలాకాలం పాటు సతమతం అయ్యారని, ఇప్పుడు వందలాది కిలోమీటర్లు విమానంలో ప్రయాణించి వచ్చి పాదయత్రలో పాల్గొనడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని పేర్కొన్నారు.
వైఎస్సార్ అలా..
ప్రజలంతా తన కుటుంబ సభ్యులే అనుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయిదు సంవత్సరాల పాటు పరిపాలించారని గుర్తు చేశారు. ఏ బహిరంగసభ అయినా, లేదా ర్యాలీలు, రోడ్ షో నిర్వహించినా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే వారని చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుడిలా చూసే వారని అన్నారు.
తల్లి, చెల్లిగా బాగోగులు..
తాను కన్నుమూసినా తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజల కుటుంబ సభ్యుడిగా చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ కూడా తన ప్రేమాభిమానాలను తల్లి, చెల్లి, ఇతర కుటుంబ సభ్యులకు పరిమితం చేయకూడదని సూచించారు. కోట్లాదిమంది భారతీయులను తన కుటుంబసభ్యులుగా చూడాలని పేర్కొన్నారు. తన చుట్టూ నిరంతరం ఉండే పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలందరినీ తన తల్లి, చెల్లిగా చూసుకున్నప్పుడే జాతి గర్విస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రజలందరూ కుటుంబ సభ్యులు..
నెహ్రూ-గాంధీ కుటుంబం అంటే సోనియా, ప్రియాంక, రాహుల్, రాబర్ట్ వాద్రా, రేహాన్, మిరాయా మాత్రమే కాదని సాయిరెడ్డి చెప్పారు. 140 కోట్లమందిని తనవాళ్లుగా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తన కుటుంబం అంటే భార్యా పిల్లలు, తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు మాత్రమే కాదని, దేశ ప్రజలందరినీ తన సభ్యులుగా భావిస్తేనే- జనం ఏ రాజకీయ నాయకుడికైనా బాధ్యతలను అప్పగిస్తారని వ్యాఖ్యానించారు.