అమరావతి నుంచి విశాఖకు సచివాలయం తరలింపుపై మరో లీక్- తేదీతో సహా..!!
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మూడు రాజధానుల అంశం.. ముందుకు కదులుతోంది. ఆ దిశగా ఒక్కో అడుగు పడుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించే విషయంలో రాజీ పడదలచుకోలేదు జగన్ ప్రభుత్వం. విశాఖకు తరలి వెళ్లడంలో ఇక ఏ మాత్రం జాప్యం జరక్కపోవచ్చంటూ మంత్రులు లీకులు ఇస్తోన్నారు.
రెండు నెలల్లో..
ఈ ఏడాది ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు ఈ విషయంపై చాలా సందర్భాల్లో మాట్లాడారు. రెండు రోజుల కిందటే- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. వచ్చే రెండు నెలల్లో విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామనీ తేల్చి చెప్పారు.
మూడురాజధానుల బిల్లుపై
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు చెబుతున్నారు. దీనికి అసవరమైన ప్రక్రియను అధికారులు ఇదివరకే చేపట్టారు. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ బిల్లు సభామోదం పొందితే.. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని వైఎస్ జగన్ పరిపాలనను సాగించడం లాంఛనప్రాయమే అవుతుంది.
సుప్రీంలో విచారణ..
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకు జారీ చేసిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిన నేపథ్యంలో మూడు రాజధానుల ప్రక్రియ మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 31వ తేదీన మరోసారి ఈ పిటీషన్లు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానున్నాయి.
రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని నిర్ధారించడానికి కోర్టులు- టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు కావంటూ ఇదివరకు న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
న్యాయపరమైన చిక్కులు తొలగుతున్నాయ్..
ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుంచి సచివాలయం తరలింపు ఎప్పుడనే విషయంపై మరో లీక్ ఇచ్చారు. మార్చి 22వ తేదీన ఉగాది పండగ కాగా. దాని కంటే ముందా? లేక తరువాతా? అనేది త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా..
వీలైనంత త్వరగా విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి ప్రయత్నాలు చేస్తోన్నామని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. సచివాలయం తరలింపుపైనే ప్రస్తుతం తాము కసరత్తు చేస్తోన్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు న్యాయపరమైన చిక్కులు కూడా ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఉగాది కంటే ముందే విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని తేల్చిచెప్పారు.