పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైసీపీ
YS Jagan oath taking ceremony: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. ధీమాగా ఉంటోన్నాయి.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డీ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. 151కి పైగా అసెంబ్లీ, 22 లోక్సభ నియోజకవర్గాల్లో జెండా ఎగురవేస్తామంటూ ఐప్యాక్ టీమ్ సమావేశంలో స్వయంగా వెల్లడించారు కూడా. అటు మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఇదే ధీమా వ్యక్తమౌతోంది.
ఈ క్రమంలో వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకార తేదీని సైతం ఖరారు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖపట్నంలో జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు.

అటు విశాఖపట్నంలో కూడా దాదాపుగా అన్ని హోటళ్ల గదులు ఫుల్ అయినట్లు చెబుతున్నారు. 9వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించడానికి అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హోటల్ రూమ్లను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల సందర్భంగా వైఎస్ జగన్ చరిత్ర తిరగరాయనున్నారని పేర్కొంది. 2019 నాటి ఫలితాలకు మించిన భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారని, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. జూన్ 9వ తేదీన ఉదయం 9:38 నిమిషాలకు జగన్ ప్రమాణం చేస్తారని తెలిపింది.












Click it and Unblock the Notifications