నాలుగో సీటు కోసం జగన్ 'పిటిషన్': చంద్రబాబు చేతికి చిక్కకుండా వ్యూహం?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'ను ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు వివరించిన వైసీపీ అధినేత వైయస్ జగన్... పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై తాజాగా మరో ఆస్త్రం సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ గురువారం వెలువడిన నేపథ్యంలో ఆ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకుండా చూడాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ద్వారా ఈ పిటిషన్ వేయించనున్నారు.
దీంతో పాటు సోమవారమే ఈ పిటిషన్ను సుప్రీం కోర్టు ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఉత్తరాఖండ్లో ఏర్పడిన సంక్షోభానికి సంబంధించి ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల కేసును ఇంప్లీడ్ కావాలని కూడా పిటిషన్లో వైసీపీ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం ఈనెల 24న రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల విడుదల చేయనుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఆశావాహుల సందడి మొదలైంది. అదే రోజు నామినేషన్ల ప్రక్రియ మొదలై 31న ముగుస్తుంది. ఎన్నికలు అనివార్యమైతే జూన్ 11న ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
జూన్ 21తో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు సీట్లు ఖాళీ అవుతుండగా, ఏపీలో నాలుగు సీట్లు.. తెలంగాణలో రెండు సీట్లుగా ఉన్నాయి. తెలంగాణ ఖాళీ అవుతున్న రెండు సీట్లు అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుచుకోనుంది. ఇక ఏపీ విషయానికి వస్తే శాసనసభలో పార్టీల బలాబలాలను బట్టి ఇందులో మూడు టీడీపీకి, ఒకటి వైసీపీకి దక్కే అవకాశం ఉంది.
టీడీపీ 'ఆకర్ష్'లో భాగంగా వైసీపీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగో సీటుకు పోటీ ఉంటుందా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ గెలిచే మూడు సీట్లకు ఎవరెవరు బరిలోకి దిగేదీ ఇంకా స్పష్టత రాలేదు.
గడచిన ఎన్నికల్లో వైసీపీ తరుపున మొత్తం 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ ఎమ్మెల్యేలలో 17 మంది టీడీపీలో చేరారు. దీనితో వైసీపీ సంఖ్యాబలం 50కి పడిపోయింది. అంతేకాదు టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వలసలు ఇంకా బ్రేక్ పడలేదు. ఈ క్రమంలో ఆ పార్టీ నుంచి మరికొన్ని వలసలు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఇలా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరే ఎమ్మెల్యేల సంఖ్య 30 దాటితే రాజ్యసభ సీటును వైసీపీ గెలవడం కష్టం. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు లేకుండా చేస్తే టీడీపీకి మూడు, వైసీపీకి ఒక సీటు గెలుచుకోవడం ఖాయం. ఇందులో భాగంగానే వైయస్ జగన్ ఈ పిటిషన్ను సుప్రీం కోర్టులో దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications