బాబుపై వైసీపీ ఎమ్మెల్యే నిప్పులు, హైద్రాబాద్కు సింగపూర్ ప్రతినిధులు
గుంటూరు: రాజధాని భూముల సర్వే పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి పైన మంగళగిరి ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు. రాజధాని భూముల పైన ప్రభుత్వం దొడ్డిదారిన ఏరియల్ సర్వే జరుపుతోందని ఆరోపించారు.
రోడ్డు మార్గం ద్వారా సర్వే చేస్తే రైతుల ఆగ్రహం చూడాలన్న భయంతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించిందని విమర్శించారు. ఎప్పటికైనా రోడ్డు మార్గంలో సర్వే చేయాల్సి వస్తుందని, అప్పుడు రైతులు వారిని అడ్డుకుంటారని హెచ్చరించారు.
రాజధాని పరిధిలో సర్వే
ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని గ్రామాల్లో సింగపూర్ బృందం ఏరియల్ సర్వే నిర్వహించింది. మొదటి విడతలో తూళ్లూరు, రాయపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మందడం, వెంకటపాలెం, హరిచంద్రపునం, బోరుపాలెం గ్రామాల్లో పర్యటించి సర్వే చేశారు.
రెండో విడత కృష్ణా నది తీరంలోని లంక గ్రామాలపై ఏరియల్ సర్వే జరిగింది. తర్వాత రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రదేశాన్ని ఎంపిక చేస్తారు. ఇక్కడి నుంచి రాజధాని నిర్మాణ ప్రణాళిక మొదలవుతుంది. ప్రకాశం బ్యారేజీకి పశ్చిమం నుంచి కేంద్ర ప్రదేశం మొదలయ్యే అవకాశముంది.
రెండో రోజు ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన సింగపూర్ ప్రతినిధుల బృందం అనంతరం హైదరాబాదుకు బయలుదేరింది. వారు గన్నవరం విమానాశ్రయంనుండి హైదరాబాదుకు వచ్చారు.
నల్లజెండాల ప్రదర్శన
కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ఏపీ రాజధాని ప్రాంతంలో సింగపూర్ ప్రతినిధుల సర్వే పైన పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లిలో రైతులు నల్ల జెండాలు, నల్ల కాగితాలు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని ఏర్పాటుకు తాము అనుకూలంగానే ఉన్నామని, కానీ రాజధాని ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేమన్నారు.