క్యాపిటల్ కోసం జరిగిన సభకాదు; క్యాపిటలిస్టుల కోసం జరిగిన సభ: మండిపడిన గుడివాడ అమర్నాథ్
న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ అమరావతి ప్రాంత రైతులు తుళ్లూరు నుండి తిరుపతి వరకు మహా పాదయాత్ర నిర్వహించి, తిరుమల శ్రీవారిని దర్శించుకుని, తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రైతులు నిర్వహించిన మహా పాదయాత్ర లో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనగా, ప్రతి జిల్లాలోనూ రైతుల పాదయాత్రకు విశేష మద్దతు లభించింది. శుక్రవారం నాడు తిరుపతి వేదికగా అమరావతి నిర్వహించిన భారీ బహిరంగ సభ సక్సెస్ అయింది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, జనసేన, విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే రైతు నిర్వహించిన మహాసభ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

క్యాపిటల్ కోసం జరిగిన మహా సభ కాదు
ఇది కేవలం చంద్రబాబు నిర్వహించిన మహాసభ అని మండిపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబును టార్గెట్ చేయగా, తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇది ఏపీ క్యాపిటల్ కోసం జరిగిన మహా సభ కాదని, క్యాపిటలిస్టు కోసం జరిగిన మహా సభ అని, చంద్రబాబు కోసం రైతుల పేరుతో టీడీపీ మద్దతుదారులు పాదయాత్ర చేశారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.

ఉత్తరాంధ్ర , రాయలసీమపై దండయాత్ర చేసినట్టు అమరావతి రైతుల పాదయాత్ర
ఉత్తరాంధ్ర ,రాయలసీమ పై దండయాత్ర చేసినట్లుగా అమరావతి కోసం రైతులు పాదయాత్ర చేశారని విమర్శించారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటే చంద్రబాబు కు వచ్చిన నష్టం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్. ఇక ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉందని, త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని, మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

బీజేపీ నేతలపై ఫైర్ , కమ్యూనిస్టులు, క్యాపిటలిస్ట్ ల పార్టీలకు మద్దతు ఇస్తారా ?
రాజధాని అమరావతి కోసం తిరుపతిలో జరిగిన బహిరంగ సభకు బిజెపి నేతలు హాజరు కావడాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తప్పుబట్టారు. బిజెపి నేతలు స్కామ్ అని చెప్పి అమరావతి సభకు ఎలా హాజరయ్యారని ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన సభ ఒక పనికిమాలిన సభ అని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టు పార్టీలు కూడా క్యాపిటలిస్టు పార్టీలకు ఎలా మద్దతు పలుకుతారని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్.

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ కు ఒక స్టాండ్ లేదని ఆయన ఎక్కడికి వెళ్ళినా అదే రాజధాని అంటారు అంటూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు గుడివాడ అమర్నాథ్. రాజకీయ సిద్ధాంతాలు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ ని ఎద్దేవా చేశారు గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉంచాలి అని అంటున్నారో చెప్పాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇదంతా .. విశాఖపై చంద్రబాబు విషం
అమరావతి రైతుల పేరుతో సాగించిన మహా పాదయాత్ర రాష్ట్ర రాజధాని కోసం చేసిన పాదయాత్ర కాదని రియల్ఎస్టేట్ కోసం చేసిన పాదయాత్ర అంటూ మండిపడ్డారు చంద్రబాబు తన ఆలోచనలను రాష్ట్ర ప్రజలపై రుద్దుతున్నారు అని ఎద్దేవా చేశారు. భూములు కాపాడుకోవడం కోసం భూముల విలువలు పెంచుకోవడం కోసం చంద్రబాబు ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగిందని ఆరోపించారు. త్వరలోనే మూడు రాజధానులు బిల్లు ప్రవేశపెడతామని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపై కావాలని చంద్రబాబు విషం చిమ్ముతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్.












Click it and Unblock the Notifications