కాకాణికి షాక్: ఆ డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీ, కోర్టులో ఛార్జీషీట్ దాఖలు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అక్రమంగా సంపాదించి మలేసియా, థాయ్లాండ్లలో రూ.కోట్ల ఆస్తులు కూడబెట్టారని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ద
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అక్రమంగా సంపాదించి మలేసియా, థాయ్లాండ్లలో రూ.కోట్ల ఆస్తులు కూడబెట్టారని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్రెడ్డి చేసిన ఆరోపణలన్నీ కుట్రపూరితమేనని పోలీసులు తేల్చారు.సోమిరెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే కాకాణి గోవర్థన్రెడ్డి ఈ ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కాకాణి గోవర్థన్రెడ్డికి సవాల్ విసిరారు. అంతేకాదు ఈ ఆరోపణలపై విచారణ చేయాలని ఏపీ డీజీపిని కలిసి వినతిపత్రం సమర్పించారు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.
కొంతకాలం క్రితం ఏపీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు.అక్రమంగా సంపాదించిన ఆస్తులను సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మలేషియాలో దాచుకొన్నాడని ఆయన ఆరోపణలు గుప్పించారు.
ఈ ఆరోపణలపై సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీవ్రంగానే స్పందించారు. ఈ ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని సోమిరెడ్డి కాకాణి గోవర్థన్రెడ్డికి సవాల్ విసిరారు. కాకాణి గోవర్థన్రెడ్డి కొన్ని డాక్యుమెంట్లను చూపాడు. ఈ డాక్యుమెంట్లపై పోలీసులు విచారణ జరిపారు.

.కాకాణి చూపినవి ఫోర్జరీ డాక్యుమెంట్లు
వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థరెడ్డి వెలుగులోకి తెచ్చిన డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీవేనని ఫోరెన్సిక్ లేబొరేటరీ తేల్చింది. వైసీపీ ఎమ్మెల్యే చెప్పిన తేదీల్లో సోమిరెడ్డి అసలు మలేసియాకే వెళ్లలేదని ఇమిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఈ కేసులో పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారీ చేసిన కేసులో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

22 మంది సాక్షులను విచారించిన పోలీసులు
నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్తోపాటు మరో 22 మందిని సాక్షులుగా చేర్చి వారు అందించిన సమాచారాన్ని కూడా చార్జిషీటులో పొందుపరిచారు. ఈ నెల 11వ తేదీన న్యాయస్థానంలో చార్జిషీటు సమర్పించారు. మంత్రి సోమిరెడ్డి 2003 సెప్టెంబరు 13న మలేసియాకు వెళ్లినట్లు, అక్కడ ఆయనకు స్థిరాస్తులు, బ్యాంకుల్లో నగదు ఉన్నాయని, థాయ్లాండ్లో సోమిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు పవర్ప్రాజెక్టు ఉందని ఎమ్మెల్యే కాకాణి ఆరోపించారు. 2016 డిసెంబరులో ఈ మేరకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని డాక్యుమెంట్లను అందించారు. దీనిపై సోమిరెడ్డి అదే ఏడాది డిసెంబరు 28న నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

.ఫోర్జరీ డాక్యుమెంట్లుగా నిర్ధారణ
కాకాణి గోవర్థన్రెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై చేసిన ఆరోపణలకు సంబంధించి చూపిన ఆధారాలన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లుగా ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. కాకాణి బయటపెట్టిన పత్రాలన్నీ నకిలీవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ధ్రువీకరణను చార్జీషీట్కు జతపరిచారు. అలాగే 2003 సెప్టెంబరు 13న సోమిరెడ్డి మలేసియా వెళ్లినట్లు ఆధారాల్లేవని.. అసలు ఆయన పాస్పోర్టుకు దరఖాస్తు చేయనేలేదని ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లు పొందాడిలా
చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం అడవికొడింబేడుకు చెందిన పసుపులేటి చిరంజీవిని ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీలో కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. చిరంజీవి ఇంటి నుండి కొన్ని ఫోర్జరీ పత్రాలను, స్టాంపులను పోలీసులుస్వాధీనపరుచుకున్నారు. రూ.లక్ష ఇస్తే ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు అందజేయడానికి కాకాణితో ఒప్పందం చేసుకున్నట్లు చిరంజీవి వెల్లడించాడు. దీంతో పోలీసులు కాకాణిని ప్రథమ నిందితుడిగా, పసుపులేటి చిరంజీవి ఏ-2గా, పి.వెంకటకృష్ణ ఏ-3గా, జి.హరిహరన్ ఏ-4గా పేర్కొంటూ కేసు నమోదు చేసి.. ఈ ఏడాది జనవరిలో చిరంజీవి, వెంకటకృష్ణ, హరిహరన్లను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications