జగన్.. ఎన్టీఆర్ కాదు! తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు: పొరపాటుకు రోజా ‘సారీ’
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మద్యపాన నిషేధం అంశంపై ఆమె మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ప్రతిపక్షం చేసిన విమర్శలను తిప్పికొట్టారు.
గడ్డిపరిక సింహం కాలేదు: మగధీర డైలాగులు..పనికి మాలిన నాయకుడు: చంద్రబాబు పై రోజా ఫైర్..!
చంద్రబాబు విజన్ 420..
చంద్రబాబు విజన్ 2020 కాదు.. విజన్ 420 అని రోజా ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో రూ. 75వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని, మరి చంద్రబాబుకు మద్యం అంటే అంత మక్కువ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. మద్యం వల్ల పేదవాళ్ల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మద్యం పాలసీతో కొన్ని లక్షల మంది కుటుంబాలు అన్యాయమైపోయాయని మండిపడ్డారు.
ఆ ఘనత జగన్దే
ఆరు నెలల్లోనే దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. 43వేల బెల్ట్ షాపులను తొలగించి, 40 శాతం బార్లు కూడా తగ్గించారన్నారు రోజా. గతంలో ఉన్న 4వేలకుపైగా పర్మిట్ రూంలను తొలగించారన్నారు. జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చరిత్ర సృష్టించారన్నారు. మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి మహిళా అభినందిస్తోందని రోజా అన్నారు.
పొరపాటుకు సారీ చెప్పిన రోజా
బ్రాందీ పాలనను అంతం చేసి గాంధీ పాలనను తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. మద్యపాన నిషేధం చర్చ జరుగుతుంటే ముఖ్యమంత్రి పారిపోయారంటూ వ్యాఖ్యానించిన రోజా.. తన పొరపాటు వెంటనే గుర్తించి క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు పారిపోయారంటూ రోజా తన వ్యాఖ్యలను సరిచేసుకున్నారు.
తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు..
జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు కీలక పదవులు లభించాయని అన్నారు. డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవులను జగన్ దళితులకే కట్టబెట్టారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు కూడా ఏర్పాటు చేశారని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు.. ఎస్సీలను అంటరాని వారని, ఎస్టీలకు బుర్రలేదని అన్నారని రోజా చెప్పారు. మద్యం రేట్లు పెరిగాయి కదా తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు పలకరిస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. మద్యం ధరలు పెరగడంతో మందుబాబులు బట్టలు, చెప్పులు కొనుక్కోలేని పరిస్థితిలోకి వెళ్లారని చంద్రబాబ అంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఆ పని చేయలేదు సంతోషం..
మొన్న ఉల్లి ధర పెరిగిందని మెడలో ఉల్లిపాయలు వేసుకొచ్చారని.. ఇప్పుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు మద్యం ధరలు పెరిగాయని.. మద్యం సీసాలు మెడలో వేసుకొస్తారేమోనని తాను భయపడ్డానని అన్నారు రోజా. అయితే అలా చేయకపోవడం సంతోషమని అన్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలవుతోందని చెప్పారు. నారా వారి సారా పాలన నుంచి విముక్తి లభించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో సరైన వర్షాలు పడలేదని, కృష్ణా నదికి ఏనాడు వరద రాలేదని.. అయితే రాష్ట్రంలో మాత్రం మద్యం ఏరులై పారిందని విమర్శించారు.
జగన్ ఎన్టీఆర్ కాదు..
వెన్నుపోటు పొడిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏమీ.. ఎన్టీఆర్ కాదని రోజా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పులి అని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన చిరునవ్వుతో ఎదుర్కొన్నారని చెప్పారు. పులిహోర తిన్నంత మాత్రాన పులులు అయిపోరంటూ రోజా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చుతున్నారని ఆమె అన్నారు. అలాంటి వారిని పులి అంటారు కానీ.. పులిహోర బ్యాచ్ను పులి అనరు అని రోజా ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి తోబుట్టువులా పుట్టలేదనే బాధ ఉందని.. అయినా ఆయన సొంత సోదరిలానే చూసుకుంటారని అన్నారు.