చంద్రబాబు నటిస్తున్నారు, ఆయన చర్యల వల్లే హోదాకు ముప్పు: రోజా
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. శుక్రవారం అర్థరాత్రి విజయవాడ కంట్రోల్ రూమ్కు ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాన్ని అధికారులు కూల్చివేశారు.
విగ్రహం కూల్చివేత విషయం వైసీపీ కార్యకర్తలకు తెలియడంతో శనివారం ఉదయం కృష్ణా జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగవీటి రాధా, జోగి రమేష్ సహా పలువురు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వైఎస్ విగ్రహం కూల్చివేత సందర్భంగా రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో మీడియాతో మాట్లాడారు.
విజయవాడలో వైయస్ విగ్రహన్ని తొలగించడం దుర్మార్గమని ఆమె అన్నారు. విగ్రహాలు కూల్చినంత మాత్రాన ప్రజల హృదయాల్లో నుంచి వైఎస్ఆర్ను తొలగించలేరని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీ పునర్ వ్వవస్థీకరణ చట్టం, హమీల అమలుపై ఆర్ధిక మంత్రి జైట్లీ రాజ్యసభలో సమాధానం ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు ప్రెస్ మీట్పై కూడా ఆమె మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నటిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబు చర్యల వల్లే ప్రత్యేకహోదాకు ముప్పు ఏర్పడిందని ఆమె చెప్పారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మరచిపోతే... టీడీపీ, బీజేపీలకు పుట్ట గతులు ఉండవని ఆమె హెచ్చరించారు.
ప్రత్యేక హోదాలో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్న విషయంపై స్పష్టత ఉన్నందుననే తమ పార్టీ అధినేత వైయస్ జగన్ ఇప్పటికే నిరసనలు చేపట్టారన్నారు. వాస్తవాలు తెలుసుకున్న చంద్రబాబు ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం బీజేపీతో పొత్తు విడనాడాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఉద్యమాలకు సిద్ధమైతే, మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రోజా పేర్కొన్నారు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 40ని రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు.