కరోనా బారిన మరో వైసీపీ ఎమ్మెల్యే: మంత్రి కుటుంబ సభ్యుల్లోనూ: హోమ్ క్వారంటైన్: ఆందోళనలో
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ప్రజా ప్రతినిధుల ఇళ్లల్లో తిష్ఠ వేస్తోంది. మొన్నటికి మొన్న విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కే శ్రీనివాసరావు ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కరోనా వైరస్ పాజిటివ్గా తేలారు. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైన కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ తాజాగా కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారు.
సాయిరెడ్డిని ఆడేసుకున్న రఘురామ: జగన్ అనుమతి ఉందా?: పార్టీ పేరేంటో తెలుసా? నీవల్లే భ్రష్టు
కొద్దిరోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు ట్రూనాట్ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. దీనితో ఆయన హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైద్య పరీక్షలను నిర్వహించారు. ఎమ్మెల్యేకు కాంటాక్ట్లో ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు స్థానిక అధికారులు. లాక్డౌన్ సడలింపుల అనంతరం ఆయన తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యే సుధాకర్ గన్మెన్ను కూడా హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంలోనూ ఒకరికి కరోనా వైరస్ సోకింది. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను కరోనా బారిన పడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనవడికి కరోనా వైరస్ సోకినట్లు జిల్లా అధికారులు నిర్ధారించారు. ఫలితంగా- అన్నా రాంబాబు సహా, ఆయన కుటుంబ సభ్యులు ముందుజాగ్రత్తలను తీసుకుంటున్నారు. రాంబాబు కారు డ్రైవర్, అటెండర్కు నిర్వహించిన ట్రూనాట్ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి.
Recommended Video
ఒకవంక రాష్ట్రంలో విస్తృతంగా కరోనా వైరస్ వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల వరకు 7,69,319 వైద్య పరీక్షలను నిర్వహించారు. రోజూ వేల సంఖ్యలో వైద్య పరీక్షలను కొనసాగిస్తున్నారు వైద్యాధికారులు. ఫలితంగా కొత్త కేసులు అనూహ్యంగా పుట్టుకొస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటిదాకా గరిష్ఠంగా ఒకేరోజు 36 వేలకు శాంపిళ్లను పరీక్షించారు. దేశంలో ఈ స్థాయిలో మరే రాష్ట్రంలోనూ పరీక్షలను నిర్వహించట్లేదని అంటున్నారు. దీనికి అనుగుణంగానే ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.