చంద్రబాబుకు పిచ్చి ఎక్కువైంది, రూ.15 కోట్లు ఆఫర్: వైసిపి ఎమ్మెల్యే
చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పిచ్చి ఎక్కువైందని, ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని వైసిపి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదివారం నాడు విమర్శించారు. అధికార టిడిపి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దారుణమన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ రెడ్డిలను చూసే ప్రజలు తమను గెలిపించారన్నారు.
ప్రతిపక్షం ప్రవేశ పెట్టే అవిశ్వాస తీర్మానం ఓటింగులో పాల్గొనకుండా ఉంటే ముందస్తుగా రూ.10 కోట్లు ఇవ్వడంతో పాటు తర్వాత రూ.5 కోట్ల మేర పనులు అప్పగిస్తామని తనకు టిడిపి వర్గాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను పార్టీ అధ్యక్షులు జగన్ దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు.
రైల్వే జోన్ ఏర్పాటుకు ఇబ్బందులు: హరిబాబు
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా పని చేస్తున్నాయని బిజెపి ఎంపీ హరిబాబు అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 2018-19 కల్లా పూర్తి చేస్తామని అన్నారు.
అయితే పోలవరంను పూర్తి చేసే గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. విజయనగరం గిరిజన విశ్వవిద్యాలయం, విశాఖ పెట్రోల్ వర్సిటీల పైన పార్లమెంటులో చట్టం చేయాలన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. రైల్వే జోన్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక కూడా జోన్ ఏర్పాటుకు అనుకూలంగా లేదన్నారు.