డొక్కా తాజా వ్యాఖ్యలతో - తాడికొండ పంచాయితీలో కొత్త టర్న్..!!
అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ నేతల వివాదం కొత్త మలుపు తీసుకుంది. తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగా.. అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కాను నియమించటం తో అక్కడ వివాదం మొదలైంది. దీంతో..రెండు వర్గాలుగా పార్టీ శ్రేణులు విడిపోయాయి. శ్రీదేవి - డొక్కా మద్దతు దారులుగా చీలక వచ్చింది. శ్రీదేవికి మద్దతుగా నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే..ఇప్పుడు పార్టీ శ్రేణులతో పాటుగా నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీల్లో సైతం చీలక కనిపిస్తోంది.
రెండుగా చీలుతున్న పార్టీ శ్రేణులు
నియోజకవర్గ పరిధిలోని మేడికొండూరు, తాడికొండ, ఫిరంగిపురం జెడ్పీటీసీ సభ్యులు డొక్కాకు మద్దతుగా నిలిచారు. అదే విధంగా మేడికొండూరు ఎంపీపీ, పార్టీ ఎస్సీ, మైనార్టీ సెల్ నేతలు శ్రీదేవికి మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలో ముందస్తు దిద్దుబాటు చర్యల్లో భాగంగా డొక్కాను తాడికొండ ఇంఛార్జ్ గా నియమించారని పార్టీ నేతలు చెబుతున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా.. ఎక్కడా లేని విధంగా తన నియోజకవర్గంలోనే అదనపు సమన్వయకర్త నియామకం ఎందుకు ఎమ్మెల్యే శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా.. ఇప్పుడు విప్ గా అవకాశం దక్కించుకున్న డొక్కాకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.
పార్టీ నిర్ణయం అంతుచిక్కక..
గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డొక్కా ..తన పాత పరిచయాలతో ముందుకు కదులుతున్నారు. ఇదే సమయంలో డొక్కా నియామకంతో ఎమ్మెల్యే మద్దతు దారులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. తాజాగా.. ఎమ్మెల్యేకు మద్దతుగా మేడికొండూరులో సమావేశం చేపట్టినవారిని పోలీసులు అరెస్ట్ చేయడం వారి ఆగ్రహానికి కారణమైంది. దీని ద్వారా శ్రీదేవికి మద్దతుగా నిలిచిన వారిలో మరింత ఆందోళన పెరుగుతోంది. అసలు పార్టీ అధినాయకత్వం మనసులో ఏముంది.. శ్రీదేవి రాజకీయ భవిష్యత్ ఏంటనే చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో, డొక్కా తిరుపతిలో కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు - ఎమ్మెల్యే శ్రీదేవి మధ్య విభేదాలు లేవని చెప్పారు. శ్రీదేవి కుటుంబంతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని వివరించారు.
నిర్ణయం మారేనా..అదే ఫైనలా
పార్టీ అప్పగించిన బాధ్యతల మేరకే తాను వ్యవహరిస్తున్నానని..త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని డొక్కా చెప్పుకొచ్చారు. మూడు రాజధానుల నిర్ణయంతో..ఇప్పుడు పూర్తిగా అమరావతి పరిధిలోకి వచ్చే తాడికొండ ..మంగళగిరి నియోజకవర్గాలు వైసీపీ అధినాయకత్వానికి సవాల్ గా మారాయి. దీంతో..ఈ రెండు నియోజకవర్గాల్లో పరిస్థితుల పైన చర్యలు ప్రారంభించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలంగా ఉంటుందని..అమరావతి రాజధాని విషయంలో స్థానికులు ప్రభుత్వ తీరు పైన గుర్రుగా ఉన్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో.. ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ముందుగానే నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది. అయితే, తాడికొండలో ప్రయోగం కొత్త సమస్యకు కారణమైంది. ఇప్పుడు వైసీపీ హైకమాండ్ తాడికొండ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మరుతోంది.