సస్పెన్షన్ పై వైసీపీ ఎమ్మెల్యేల రియాక్షన్స్ ఇవే..నియోజకవర్గాల్లో పరిస్ధితి ఇదీ..
అమరావతి : ఏపీ ఎమ్మెల్సీఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడి సొంత పార్టీ అభ్యర్ధి ఓటమికి కారణమైన నలుగురు ఎమ్మెల్యేలపై ఇవాళ సస్పెన్షన్ వేటు పడింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు ఇవాళ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వీరంతా చంద్రబాబు నుంచి క్రాస్ ఓటింగ్ కోసం కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు సజ్జల పేర్కొన్నారు.
మరోవైపు ఈ నలుగురిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సస్పెన్షన్ పై స్పందించారు. సస్పెన్షన్ పై స్పందించిన రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇది మూడు నెలల ముందే ఊహించానన్నారు. కానీ తనపై సస్పెన్షన్ వేటు వేసిన విధానం సరిగా లేదన్నారు. షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ తీసుకుని సస్పెండ్ చేసి ఉండాలన్నారు. కానీ అలా జరగలేదని, దాన్ని మాత్రమే తప్పుబడుతున్నట్లు తెలిపారు.
మరోవైపు సస్పెండైన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..రిలాక్స్గా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో చాలా సంతోషంగా ఉన్నానన్నారు. మంచి చేసినవారికి కూడా కొందరు చెడు చేస్తారని, అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారిందన్నారు. జగన్కు మద్దతిచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారని, తన నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారన్నారు. కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తానన్నారు. ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. పార్టీ అగ్రనేతలకు మానవతాభావాలు అవసరమని, వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామందిలో గుసగుసలు మొదలయ్యాయని బాంబు పేల్చారు.
అటు సస్పెండైన మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గం తాడికొండలో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఉండవల్లిలో ఆమె ఫ్లెక్సీల్ని చించేసి పార్టీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. మరోవైపు సస్పెన్షన్ తర్వాత ఆమె ఫోన్లో అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు సస్పెండైన మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం వైసీపీ నిర్ణయంపై మౌనం వహిస్తున్నారు. ఆనం, కోటంరెడ్డిని లెక్కలోకి తీసుకోలేదంటూ నిన్న సజ్జల చేసిన ప్రకటన నేపథ్యంలో సస్పెన్షన్ ను వీరిద్దరూ ముందే ఊహించినట్లు తెలుస్తోంది.