ఉరి వెయ్యటం, విషం తాగటం.. ఏంటిది? టీడీపీ తీరుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్
వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఏపీలో చేపడుతున్న సంక్షేమ పథకాల పై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శల పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో జగనన్న సంపూర్ణ గృహ పథకం లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన ఎంపీ మార్గాని భరత్, జగనన్న సంపూర్ణ గృహ పథకం పొందడం కోసం వన్ టైం సెటిల్మెంట్ అందించడం ఒక చక్కని కార్యక్రమమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలు కావాలనే ఓటీఎస్ పై దుష్ప్రచారం
ఇక తెలుగుదేశం పార్టీ నేతలు కావాలని వన్ టైం సెటిల్మెంట్ పై బురద జల్లుతున్నారని పేదల మెడకు ఉరి తాళ్ళు, వన్ టైం సెటిల్మెంట్ చెల్లించలేక పేదలు విషం తాగుతున్నారు అంటూ వైసీపీపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు లేని పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వారి ఇళ్లపై అధికారాలను ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని, అందుకే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకొచ్చారని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు.

ఉగాది వరకు కొనసాగే ఈ పథకాన్ని అందిపుచ్చుకోవాలని మార్గాని భరత్
రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల కుటుంబాలకు, 1.58 లక్షల కోట్ల ఆస్తిని ఈ పథకం ద్వారా అందించనున్నారని ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఉగాది వరకు కొనసాగే ఈ పథకాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుడు అందిపుచ్చుకోవాలని మార్గాని భరత్ వెల్లడించారు. రాష్ట్రంలో పేదలకు లక్షా 25 వేల కోట్ల రూపాయలను వివిధ పథకాల ద్వారా అందజేశారని, అత్యంత పారదర్శకంగా ఎవరి ప్రమేయం లేకుండా బటన్ నొక్కడం ద్వారా నేరుగా పేదల ఖాతాలోకి డబ్బులు జమ చేశారని మార్గాని భరత్ పేర్కొన్నారు. జగన్ సర్కారు ప్రజలకు లబ్ధి చేకూరుస్తుంటే సంక్షేమ పథకాలపై తెలుగుదేశం పార్టీ నేతలు బురద చల్లుతున్నారని, టీడీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఓటీఎస్ పై రాజమండ్రిలో టీడీపీ ఆందోళన
ఇదిలా ఉంటే ఒక ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. వన్ టైం సెటిల్మెంట్ రద్దు చేయాలన్న డిమాండ్ తో రాజమండ్రి వేదికగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఓటిఎస్ అమలు చేస్తే ప్రజలకు ఉరే సరి, విషమే గతి అంటూ బ్యానర్లతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటిఎస్ పేరుతో వాలంటీర్లు బలవంతపు వసూళ్లు చేస్తున్నారని, ఓటిఎస్ కట్టకపోతే ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేస్తామని బెదిరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు.

జగన్ సర్కార్ పై విరుచుకుపడిన టీడీపీ .. చురకలంటించిన వైసీపీ ఎంపీ
ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి పేదల ఇళ్లను ఆదాయ వనరుగా మార్చుకోవాలని ఆలోచన చేయలేదని, పక్కా ఇళ్లకు తమ పేర్లు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా ఎవరూ చేయలేదని, పేదల డబ్బులతో ఖజానా నింపుకోవాలని ప్రయత్నం కూడా చేయలేదని తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి నేతల వ్యాఖ్యలకు సమాధానంగానే ఎంపీ మార్గాని భరత్ టిడిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదల కోసం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి, లబ్ధిదారులు ప్రతి ఒక్కరు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications