బిజెపితో నష్టమనే బాబు తెగదెంపులు, తెలుగు ప్రజల గొంతును నొక్కిన కేంద్రం: వైసీపీ
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో వస్తున్న మార్పులను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు కేంద్రంపై టిడిపి అవిశ్వాసాన్ని పెట్టిందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలు కావడంతో బిజెపితో ఉంటే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తోందని భావించి కేంద్రంపై టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిందని రాజమోహన్ రెడ్డి చెప్పారు.
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై అవిశ్వాసం విషయంలో టిడిపి యూ టర్న్ తీసుకొందని వైసీపీ ఎంపీలు విమర్శలు గుప్పించారు.
సభ ఆర్డర్లో లేని కారణంగానే తమ అవిశ్వాస నోటీసు చర్చకు రాలేదని వైసీపీ ఎంపీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తమకు ఇష్టా రీతిలో వ్యవహరిస్తోందని చెప్పారు.

టిడిపి యూ టర్న్
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో టిడిపి యూ టర్న్ తీసుకొందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పారు. అవిశ్వాసం విషయంలో టిడిపి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. లోక్సభ ఆర్డర్లో ఉంటే ఇవాళ అవిశ్వాస నోటీసుపై చర్చ జరిగేదని ఆయన చెప్పారు. అవిశ్వాసానికి సంబంధించి అవసరమైన 50 మందొ ఎంపీల మద్దతును కూడగట్టామని చెప్పారు.

కాంగ్రెస్కు కూడ మద్దతిస్తామని హమీ
కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో పాటు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గేతో కూడ అవిశ్వాసం విషయంలో మద్దతివ్వాలని కోరామని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ తమ అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని హమీ ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే సోమవారం నాడు కూడ మరోసారి కేంద్రంపై అవిశ్వాస నోటీసును ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆ రోజు ఏ రకమైన పరిస్థితులుంటాయో చెప్పలేమన్నారు. అవిశ్వాసం పెట్టాలని సవాల్ చేసినవారు ఎక్కడకు వెళ్ళిపోయారో చెప్పాలని పరోక్షంగా పవన్ కళ్యాణ్పై మేకపాటి రాజమోహన్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తెలుగు ప్రజల గొంతు నొక్కారు
కేంద్రంపై అవిశ్వాసం చర్చకు రాకుండా తెలుగు ప్రజల గొంతు నొక్కారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సభ ఆర్డర్లో లేదనే కారణంగా అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేశారని ఆయన చెప్పారు. సభలో ఆర్డర్లో లేని సమయంలో కూడ ద్రవ్య వినిమయ బిల్లును ఎలా ఆమోదించుకొన్నారో చెప్పాలని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

పదవులకు రాజీనామాలు చేస్తాం
పార్లమెంట్ సమావేశాల చివరి రోజున ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపర్చిన హమీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications