సాయిరెడ్డి, సజ్జల మధ్య ఆధిపత్య పోరు -జగన్ 100 తప్పులను మోదీ కాస్తారా? -వైసీపీ ఎంపీ రఘురామ తాజా
దేశ ద్రోహం కేసులు బెయిల్ పై ఉన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మళ్లీ అదే పనిగా సొంత పార్టీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. జగన్ సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిలపైనా రెబల్ ఎంపీ అనూహ్య కామెంట్లు చేశారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ.. ఏపీకి సంబంధించిన పలు విషయాలు చెప్పుకొచ్చారు. రఘురామ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...

ఇందుకే ఆదివారం ప్రెస్మీట్
''సాధారణంగా ఆదివారాలు నేను ప్రెస్ మీట్ పెట్టను. కానీ ఇవాళ్టి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. నేడు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం. ఇది ఏపీకి కూడా ముఖ్యమైన రోజే. ఎందుకంటే, ఏపీలోని ప్రతి పిల్లాడు లేదా పాపాయికి తల్లిదండ్రులకంటే తానే ఎక్కువగా బాధ్యత వహిస్తానని, వాళ్లందరిచేతా మావయ్యా అని పిలిపించుకోవాలన్నదే తాపత్రయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు మార్లు చెప్పారు. మామయ్యగా పిల్లల్ని కాపాడాల్సిన ఆయన గతంలో పరీక్షలు నిర్వహిస్తానని ప్రమాదకర సంకేతాలివ్వగా, ఇప్పుడేమో బడులు తెరుస్తానని బాంబు వేశారు.

ఢిల్లీ తరహాలో ఏపీ చేయలేదా?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉంకా పూర్తిగా తొలగిపోలేదు, మరోవైపు మూడో వేవ్ రావొచ్చని సాక్ష్యాత్తూ ప్రధాని నరేంద్ర మోదీనే అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తున్నారు. ఇవేవీ పట్టని జగన్.. కరోనా వేళ స్కూళ్ల రీఓపెనింగ్ కు సిద్ధం కావడం శోచనీయం. మొన్నటిదాకా కరోనా కేసుల్లో ఏపీతో పోటీ పడిన ఢిల్లీలో ఇప్పుడు కొత్త కేసులు 300లోపే వస్తున్నాయి, ఏపీలో మాత్రం ఇంకా 3వేలకు దగ్గరగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం తరహాలో బడులను ఆన్ లైన్ ద్వారానే నిర్వహించకూడదా? ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచ నేతలకు భిన్నంగా వాదిస్తోన్న జగన్.. పిల్లలు బడికి వెళితేనే బాగుపడతారని చెప్పడం ప్రస్తుత కరోనా స్థితిలో సరైంది కాదు. నిజంగా పేరెంట్స్ అభిప్రాయం తీసుకోవాలంటే రహస్య బ్యాలెట్ పెట్టండి..

ప్రధాని కాకుంటే 40ఏళ్లు జగనే సీఎం
వైఎస్ జగన్ ఏపీకి 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటారని కొందరు వైసీపీ నేతలు కోరుతున్నారు. నేనైతే ఆయన 40 ఏళ్లు సీఎంగా ఉండాలని ఆకాక్షిస్తా. అది కూడా జగన్ ప్రధానమంత్రి కాకపోతోనే సుమా! జగన్ ఎంత ఎత్తుకు ఎదిగినా, పెద్దల మాట వినాలని నేను విన్నవించుకుంటున్నాను. ఆయన భారతంలో ధుర్యోధనుడిలా ఉండొద్దన్నదే నా అభిమతం. పార్టీలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి సీనియర్లెందరో ఉన్నారు, మాయాబజార్ సృష్టించగల బుగ్గన రాజేందర్ లాంటివాళ్లూ ఉన్నారు. వాళ్లలో ఎవరో ఒకరి మాట వినాలేగానీ, సలహాదారులుగా చెలామణి అవుతోన్న మాటలింటే జగన్ ధుర్యోదనుడిగా మిగులుతారు..

జగన్ 100 తప్పులను మోదీ కాస్తారా?
ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే, జగన్ మాత్రం అన్నిటికి అన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 180కిపైగా జగన్ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమని కోర్టుల్లో కొట్టుడుపోయాయి. ఇది చాలదన్నట్లు తన సలహాదారులతోనే కోర్టులపై దాడి చేయిస్తున్నారాయన. జగన్ సర్కారు సలహాదారులపై హైకోర్టు వ్యాఖ్యానిస్తే.. కోర్టునే ప్రశ్నించేలా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. ఐఏఎస్, ఐపీఎస్ లను కోర్టులు శిక్షిస్తున్నా సీఎం ధరణి మారలేదు. పైనున్న కేంద్రం ఇవన్నీ గమనిస్తోంది. నాడు శ్రీకృష్ణుడు శిశిపాలుడి 100 తప్పులు అయ్యేదాకా ఛాన్స్ ఇచ్చినట్లే, జగన్ కూడా 100 తప్పులు చేసేదాకా ప్రధాని మోదీ కాస్తూ ఉంటారా? లేదా అనేది చూడాలిక..
Recommended Video

సలహాదారుకు సీరియస్ వార్నింగ్
ఓవైపు ఏపీ సమస్యలపై పోరాడుతామని మీడియాతో చెబుతూ, పార్లమెంటులోపల మాత్రం నా అనర్హత వేటుపై వైసీపీ ఎంపీలు నినదిస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను పార్టీకి లాయల్ గానే ఉన్నాను. జగన్ కొనుక్కున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని నేనెప్పుడు మీరలేదు. రేప్పొద్దున ఈ పార్టీని ఇకెవరైనా కొనుక్కున్నా నేను విధేయుడిగానే ఉంటారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా నా ఫోన్లో కృత్రిమ మెసేజ్ లు వేసి, వాటిని నేను ఎవరికో పంపినట్లు చిత్రీకరించి, ఆ కథనాలను సాక్షిలో రాశారు. ఆ చెత్తపై కోర్టులు సుమోటోగా విచారణ చేయాలని సజ్జల కోరడం ఇంకా సిగ్గుచేటు. నా గురించి ఇంకోసారి మాట్లాడేముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. అమరావతిపై ఇంకా ఇంకా కేసులు పెడుతూనే ఉంటామని ఆ వదరబోతు సజ్జల వాగాడు. అసలు..

దాని కోసం సాయిరెడ్డితో సజ్జల పోరు
ఆధునిక భారతంలో జగన్ ను ధుర్యోధనుడిగా మార్చేందుకు ఎంపీ సాయిరెడ్డి అనునిత్యం శకునిలా ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడా శకుని పాత్రలో తానుండాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లుంది. జగన్ సర్కారు ఇబ్బడి మొబ్బడిగా చేస్తోన్న అప్పులకు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్నే గ్యారంటీగా చూపించినట్లు తెలుస్తోంది. అంటే, మద్య నిషేధం వట్టిమాటేఅన్నమాట. జగన్ ఇప్పటికైనా తనను తాను సరిచేసుకుని, సజ్జల, సాయిరెడ్డిలాంటి శకునుల్ని దగ్గరికి రానీయకుండా ఉంటే ఏపీ ప్రజలకు మేలు జరుగుతుంది'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.












Click it and Unblock the Notifications