నన్నేమీ చేయలేక..అలా కక్ష సాధించారు..వెలేశారు: వైసీపీపై రఘురామ నిప్పులు: టార్గెట్ సాయిరెడ్డి
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎంపీగా గుర్తింపు పొందిన నేత నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు. పార్టీలో రెబెల్ ముద్రతోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పు పడుతున్నారు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ సహా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఘాటు విమర్శలను చేస్తూ వస్తోన్న ఆయన ప్రస్తుతం అనర్హత వేటును ఎదుర్కొంటున్నారు.
రఘురామను అనర్హుడిగా గుర్తించాలంటూ ఇదివరకే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఙప్తి చేశారు. తాజాగా లోక్సభలో చోటు చేసుకున్న సీట్ల సర్దుబాటులో.. వెనక్కి వెళ్లారు. ప్రాధాన్యతను కోల్పోయారు. దీనిపై రఘురామ కృష్ణంరాజు స్పందించారు. దీనికంతటికీ కారణం విజయసాయి రెడ్డేనని ఆరోపిస్తున్నారు. పార్టీ నేత ఇచ్చిన లేఖ మేరకే లోక్సభ స్పీకర్ తన సీటను మార్చారని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రాధాన్యత లేని స్థానానికి పంపించారని అన్నారు. ఆ నేత ఎవరో అందరికీ తెలుసునని సాయిరెడ్డి గురించి పరోక్షంగా ప్రస్తావించారు.
రఘురామరాజుకు మరో ఝలక్.. లోక్ సభలో సీటు మార్చిన వైసీపీ... మరో ఇద్దరికీ
ఏ సభ్యుడికీ లేని గౌరవం తనకు ఉందని, లోక్సభ సమావేశాల్లో ఏడాదికాలంలో 53 సార్లు తాను వివిధ అంశాలపై ప్రసంగించానని అన్నారు. తన ప్రతిభను గుర్తించిన స్పీకర్.. తనకు ముందు వరుస సీట్లను కేటాయించారని రఘురామ చెప్పుకొచ్చారు. అత్యుత్తమ పార్లమెంటేరియన్గా దక్కిన పురష్కారాన్ని సొంత పార్టీ నేతలే లాక్కున్నారని ఆరోపించారు. తనను అనర్హుడిని చేయలేమనే విషయాన్ని గ్రహించే.. ప్రాధాన్యత లేని స్థానానికి పరిమితం చేసి, కక్ష తీర్చుకున్నారని విమర్శించారు.
Recommended Video
పార్టీకి కేటాయించిన సీట్లల్లో ఎవరు ఎక్కడ కూర్చోవాలనేది పార్టీ నిర్ణయమేనని, దాన్ని పాటిస్తానని అన్నారు. ఎక్కడ కూర్చున్నా తన ప్రాధాన్యత మాత్రం తగ్గదని అన్నారు. వివిధ అంశాలపై చర్చల్లో పాల్గొంటానని, తిరిగి తాను కోల్పోయిన స్థానాన్ని దక్కించుకుంటానని చెప్పారు. తనను వైసీపీ నుంచి వెలివేసినట్టుగా కనిపిస్తోందని రఘురామ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాను పార్టీలోనే కొనసాగుతానని, వైఎస్ జగన్కు విధేయుడిగానే ఉంటానని ఆయన స్పష్టంచేశారు.