రఘురామ వివాదం: జగన్పై మోదీకి ఫిర్యాదు -జీజీహెచ్లో ఎంపీకి 18 రకాల టెస్టులు -సుప్రీం ఏం చెబుతుందో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విద్రోహ చర్యలకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడలోని ప్రఖ్యాత రమేశ్ ఆస్పత్రిలో టెస్టులు చేయాలని కోర్టు ఆదేశించినా, జగన్ సర్కారు మాత్రం ఎంపీని గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రికే తీసుకెళ్లింది. మరోవైపు ఈ వివాదంలో కేంద్రం జోక్యాన్ని కోరుతూ రఘురామ కుటుంబం ఢిల్లీ పెద్దలను ఆశ్రయించింది..

18 రకాల టెస్టులు..
సీఐడీ కస్టడీలో ఉన్న తనను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం, దానికి సంబంధించిన ఆధారాలుగా కొన్ని ఫొటోలనూ సమర్పించిన నేపథ్యంలో అసలేం జరిగిందో వెంటనే చెప్పాలని, ఒకవేళ పోలీసులు నిజంగానే ఎంపీని కొట్టి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించడం తెలిసిందే. ఎంపీని రమేశ్ ఆస్పత్రిలో టెస్టులు చేయించాలని కోర్టు ఆదేశించినా, సర్కారు మాత్రం రఘురామను గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రికే తీసుకెళ్లింది. రఘురామకు గుంటూరు జీజీహెచ్లో 18 రకాల టెస్టులు నిర్వహించారు.

మెడికల్ బోర్డు ఏర్పాటు..
ఎంపీ రఘురామ కేసులో మెడికల్ బోర్డును సీఐడీ కోర్టు ఏర్పాటు చేసింది. మెడికల్ బోర్డు హెడ్గా గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి నియమితులయ్యారు. సభ్యులుగా మరో ముగ్గురు వైద్యులను నియమించారు. హెడ్ ఆఫ్ ది జనరల్ మెడిన్ డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ సుబ్బారావులు వీరిలో ఉన్నారు. ఇంకా వైద్య పరీక్షల రిపోర్టులు రావల్సి ఉండడంతో రఘురామ జీజీహెచ్లోనే ఉన్నారు. టెస్టుల రిపోర్ట్స్ వచ్చాక.. నివేదికను హైకోర్టుకు, 6వ జూనియర్ సివిల్ కోర్టుకు ఇవాళ సాయంత్రంలోగా వైద్య బృందం సమర్పించనుంది. ఇదిలా ఉంటే

మోదీ, షాకు రఘురామ కొడుకు లేఖ
హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు రానున్నట్లు తెలుస్తోది. మరోవైపు, ఎంపీ కుటుంబీకులు కీలక చర్యలకు ఉపక్రమించారు. చట్టవిరుద్ధంగా తన తండ్రిని ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎంపీ రఘురామ తనయుడు భరత్ ఆదివారం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంశాఖ సెక్రెటరీ అజయ్ భల్లా తదిరులకు ఫిర్యాదు లేఖలు రాశారు. విచారణ సమయంలో ఎంపీని తీవ్రంగా హింసించారని, జగన్ సర్కారు అనుచిత వైఖరిపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications