రఘురామ మరో బాంబు-టార్గెట్ సాయిరెడ్డి ప్రగతి భారతి ట్రస్ట్-విశాఖ కబ్జాదార్లతో సెటిల్మెంట్లు ?
ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యనిర్వాహక రాజధాని విశాఖలో గతంలో సాగిన భూముల స్కాం, తాజాగా వస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు, మధ్యలో ఎంపీ విజయసాయిరెడ్డికి చెందిన ప్రగతి భారతి ట్రస్టు పాత్రను గుర్తు చేస్తూ సీఎం జగన్ కు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు తాజాగా రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఇందులో ఆయన ప్రగతి భారతి ట్రస్ట్ కార్యకలాపాలను టార్గెట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జగన్ కు రఘురామ మరో లేఖ
సీఎం జగన్ కు వరుసగా లేఖలు రాస్తున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ రాజు తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు. ఈసారి విశాఖలో గత ప్రభుత్వాల హయాంలో చోటు చేసుకున్న భూముల స్కాంలో దొరికిన దొంగలతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటిల్మెంట్ల వ్యవహారాన్ని ఆయన తెరపైకి తెచ్చారు. సంచలన ఆరోపణలతో సీఎం జగన్ కు రఘురామ లేఖ రాశారు. ఇందులో పలు కీలక అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఫైనల్ గా ఆయన వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి చెందిన ప్రగతి భారతి ట్రస్టును టార్గెట్ చేసినట్లు అర్ధమవుతోంది.
విశాఖ భూములపై సిట్ నివేదిక
విశాఖపట్నంలో గత ప్రభుత్వాల హయాంలో చోటు చేసుకున్న భూముల కబ్జాపై వైసీపీ సర్కార్ నియమించిన సిట్, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో నియమించిన సిట్ నిందితులుగా తేల్చిన వారిని శిక్షించకపోవడం, ఈ స్కాంను వైసీపీ సర్కార్ లో పెద్దలు ఎలా తమకు అనుకూలంగా వాడుకుంటున్నారన్న అంశాల్ని రఘురామ టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా సిట్ ఏర్పాటు నుంచి వరుసగా చోటు చేసుకున్న పరిణామాల్ని ఆయన సీఎం జగన్ కు మరోసారి గుర్తు చేశారు. కోట్లాది రూపాయల విలువైన విశాఖపట్నం భూ కుంభకోణంపై, మన ప్రభుత్వం, ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేసిన విషయాన్ని మీ జ్ఞాపకాల దొంతర నుంచి బయటకు తీసి మళ్లీ మీకు గుర్తు చేయాలని నేను భావిస్తున్నానని రఘురామ జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
భూకబ్జాదారులతో సాయిరెడ్డి సెటిల్మెంట్లు
విశాఖలోని మధురవాడ, కొమ్మాది ప్రాంతాలలోని వేలాది ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు గతంలో సిట్ తేల్చిందని, అప్పట్లో సీఎం జగన్ దీనిపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు సీబీఐ దర్యాప్తు కోరారని రఘురామ గుర్తుచేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల మన పార్టీ ఇన్ చార్జి ( విజయసాయిరెడ్డి ) సిట్ నివేదికలో పేర్కొన్న వారిని ఒక్కొక్కరిగా పిలిచి సెటిల్ మెంట్లు చేసుకుంటున్నారని ఇప్పుడు ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. SIT నివేదికలో పేర్లు ఉన్న వారిని పిలిపించుకుని వారి నుంచి వివాదాస్పద భూమిలో పెద్ద వాటా తనకు ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయంటూ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.
టార్గెట్ ప్రగతి భారతి ట్రస్టు
విశాఖ భూముల స్కాం నిందితులతో సాయిరెడ్డి కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపించిన రఘురామ... ఆయనకు చెందిన ప్రగతి భారతి ట్రస్టు లావాదేవీలపై పూర్తి వివరాలు ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం వుందని జగన్ కు గుర్తు చేశారు. ఆ ట్రస్టు ఎంత మేరకు నిధులు సేకరించింది? ఆ నిధులను దానం చేసిన వారు ఎవరు? ఆ ట్రస్టు పెట్టిన ఖర్చులు ఏమిటి? లాంటి అతి ముఖ్యమైన అనేక వివరాలను బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సాయిరెడ్డి ప్రజాప్రతినిధి కాబట్టి ఇలాంటి విషయాలలో గోప్యత పాటించకుండా ప్రజలకు నిజాలను బహిరంగంగా వెల్లడించడం ద్వారా మన పార్టీ ప్రతిష్ట ఇంకా బాగా పెరుగుతుందని జగన్ కు రఘురామ తెలిపారు.
Recommended Video
ఇన్ సైడర్ ట్రేడింగ్ అనుమానాలు
ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఉండనే ఉండదని గట్టిగా వాదించే మనం, విశాఖ భూ కుంభకోణంలో జరుగుతున్న పరిణామాలపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ జగన్ కు రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. . ఎందుకంటే రాజధాని మార్పు తదనంతర పరిణామాల నేపథ్యంలో విశాఖ భూ కుంభకోణం విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతున్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పేర్కొన్న వ్యక్తులు, అంశాలతో బాటు ఈ తాజా ఆరోపణలపై కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. భూ కుంభకోణంలో పాలుపంచుకున్న రాజకీయ నాయకులపైనా, అధికారులపైనా చర్యలు తీసుకోవడం ఎంతో అవసరని, రాజధాని మార్పు జరుగుతుందో లేదో ఇప్పటి వరకూ తెలియకపోయినా విశాఖపట్నం ఎప్పటి నుంచో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని రఘురామ తెలిపారు. అతి ముఖ్యమైన నగరంలో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉదంటూ జగన్ కు గుర్తు చేశారు.. విశాఖలో జరుగుతున్న ఈ లావాదేవీలలో ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి స్వార్ధపూరిత ఆలోచనా లేదని ప్రజలకు నమ్మకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. ఇలాంటి భూ భాగోతాలపై తక్షణమే చర్య తీసుకుంటే మీరు నిజమైన ప్రజానాయకుడు అనే భావన ప్రజలలో మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.