బోర్లా పడ్డ రఘురామ -చంద్రబాబుకూ శిక్ష -డా.సుధాకర్ తీరన్న సాయిరెడ్డి -సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రిపోర్ట్
దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఐడీ కస్టడీలో పోలీసులు తనను టార్చర్ చేశారని ఎంపీ ఆరోపించడంపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు.. రఘురామకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, చికిత్స నిర్వహించాలని ఆదేశించడం తెలిసిందే.
గాయాలకు సంబంధించిన పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా, రెండోరోజైన బుధవారం కూడా ఎంపీకి ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. రఘురామ వ్యవహారంలో తెరవెనుక ఉన్న శక్తులన్నిటికీ శిక్షలు తప్పవని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. రఘురామ, చంద్రబాబులపై సాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. వివరాలివి..

రెండోరోజూ రెబల్కు పరీక్షలు
జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రబాద్ (తిరుమలగిరి)లోని ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజైన బుధవారం కూడా వైద్య పరీక్షలు జరిగాయి. ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో విశ్రాంతి తీసుకుంటోన్న ఎంపీకి ఆర్మీ డాక్టర్లు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లో కలకలం రేపిన రఘురామ ఉదంతంపై సుప్రీంకోర్టు సైతం ఆదేశాలు ఇచ్చిన దరిమిలా రెండో రోజు కూడా ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి, అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలకి పంపిస్తున్నారు. ఇక ఎంపీ ఒంటిగా అనుమానిత గాయాలకు సంబంధించి..

శుక్రవారం సుప్రీంకోర్టు పరిశీలన..
సీఐడీ కస్టడీలో పోలీసులు కొట్టినట్లుగా రఘురామ ఆరోపించిన గాయాలకు సంబంధించి నిన్న (మంగళవారం) నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు నియమిత జ్యూడీషియల్ అధికారి నాగార్జున రెడ్డి.. సీల్డు కవర్లో సుప్రీం కోర్టుకు పంపింపినట్లు సమాచారం. ఈ సీల్డ్ కవర్లోని నివేదిక, వీడియోను శుక్రవారం సుప్రీం కోర్టు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఎంపీ బెయిల్ పిటిషన్ పైనా సుప్రీం విచారించనున్నందున తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో జ్యడిషియల్ కస్టడీలో ఉంటారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆర్మీ వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే..

చంద్రబాబుకూ శిక్ష తప్పదు..
ఎంపీ రఘురామ వ్యవహారంపై వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి కీలక కామెంట్లు చేశారు. రఘురామ అరెస్టుతో చంద్రబాబు అండ్ కో వణుకుతున్నారని, రెబల్ ఎంపీ వెనకున్న శక్తులకూ శిక్షలు తప్పవని హెచ్చరించారు. ''నిందితుడి కంటే చంద్రబాబే ఎక్కువ ఆందోళన చెందుతున్నాడు. నిందితుడితో పాటు అతనిని ప్రోత్సహించిన వారిని కూడా పీనల్ కోడ్ శిక్షార్హులుగా గుర్తిస్తుంది. భారీ కుట్రకే స్కెచ్ వేసి బోర్లా పడ్డాడు. అందుకే ఈ వణుకుడు. కొద్దిగా ఆలస్యం కావచ్చు. కానీ చేసిన ప్రతి దుర్మార్గానికీ శిక్ష తప్పదు బాబూ..''అని సాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

డాక్టర్ సుధాకర్.. ఎంపీ రఘురామ
జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే రఘురామను అరెస్టు చేశారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నవేళ, ఇదే రకంగా ప్రభుత్వాన్ని నిలదీసి కేసులపాలైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని ఎంపీ సాయిరెడ్డి రీకాల్ చేశారు. ''విశాఖలో రోడ్డుపై చొక్కా చించుకుని పోలీసులను తిట్టిన మత్తు డాక్టర్(సుధాకర్)కు మించిన "గమ్మత్తు"చేస్తున్నావ్ (రఘురామ)రాజా. ఇద్దర్నీ ప్రయోగించింది పచ్చ పార్టీయేనని ఈ నటన చూస్తే తెలియడం లేదా? టీడీపీ స్క్రిప్టు ప్రకారమే డ్రామా రక్తికట్టించారని తేలిపోయింది. రమేష్ హాస్పిటల్ ఇప్పుడు రమేష్ హోటల్ అయింది'' అని ఎంపీ రాసుకొచ్చారు.

రఘురామ కోసం చంద్రబాబు తెగింపు
వైసీపీ ఎంపీ రఘురామ వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపిస్తూ.. ''దరిద్రం ఫెవికాల్లా పట్టుకోకపోతే 5 కోట్ల ప్రజల గురించి ఏనాడూ ఆలోచించని నువ్వు...ఉస్కో అంటే ఎగబడే వ్యక్తిని కాపాడేందుకు ఇంతగా తెగబడటమేమిటి? ప్రజా క్షేత్రంలో ఏమని జవాబు చెబుతావు. కేంద్రం నుంచి తగినంత ఆక్సిజన్ సరఫరా లేక రోగులు యాతన పడుతుంటే ఒక్క లేఖ అయినా రాశావా?'' అని సాయిరెడ్డి నిలదీశారు.
గురువారం నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను టీడీపీ బహిష్కరించడాన్ని వైసీపీ సాయిరెడ్డి తప్పుపట్టారు. ''సీఎం జగన్ అఖిలపక్షం పెట్టాలని లేఖలు రాశాడు. అసెంబ్లీ సమావేశాలంటే మాత్రం హాజరయ్యేది లేదంటాడు చంద్రబాబు. హైదరాబాద్ కలుగు నుంచి కదలనంటాడు. ఆంధ్రాలో అడుగుపెట్టనంటాడు. ఏపీ ప్రజల కష్టాలు పట్టనోడికి అసలు రాజకీయాలెందుకు ?'' అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications