రఘురామకు గాయాలపై సీఐడీ కీలక ప్రకటన -ఎంపీ కాళ్లకు పీఓపీ కట్లు -కణాలు దెబ్బతిన్నాయన్న ఎయిమ్స్
సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, రాజద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్పై విడుదలైన నర్సాపురం వైసీపీ ఎంపీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి షాకింగ్ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఔట్ పేషెంట్ గానే ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఎంపీ కాళ్లపై అనుమానిత గాయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ కీలక వివరణ ఇచ్చింది. తప్పుడు ప్రచారాలు వద్దని హెచ్చరించింది. వివరాలివి.

ఢిల్లీ ఎయిమ్స్లో హైడ్రామా
దేశ ద్రోహం కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామ.. కస్టడీలో తనను పోలీసులు కొట్టారని చెప్పడంతో అనుమానిత గాయాలను పరీక్షించాల్సిందిగా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిని సుప్రీంకోర్టు ఆదేశించడం, రిపోర్టులు చూశాక బెయిల్ కూడా ఇవ్వడం తెలిసిందే. ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం బెయిల్ పై విడుదలైన ఎంపీ.. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్లగా, కరోనా పేషేంట్ల రద్దీ కారణంగా గది సిద్ధంగా లేకపోవడంతో, కేంద్ర ఆరోగ్య మంత్రి చొరవతో గురువారం ఆస్పత్రిలో చేరారు. ఎంపీ అడ్మిట్ అయినట్లు తొలుత వెల్లడైనా, సాయంత్రానికి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా పర్యవేక్షణలో సీనియర్ వైద్యులు రఘురామకు చికిత్స అందించారు. ఇన్పేషంట్గా ఉండాల్సిన అవసరం లేదని, ఔట్ పేషెంట్ గానే చికిత్స తీసుకోవాలని వైద్యులు నిర్ధారించారు. అయితే..

రఘురామ కాళ్లకు కట్లు..
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరికాళ్లలో కణాలు బాగా దెబ్బతిన్నట్లు ఆయనకు చికిత్స అందించిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం గుర్తించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఎంపీ రెండు కాళ్లకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ) కట్టు కట్టారు. గాయాలు పూర్తిగా తగ్గేదాకా నేలపై కాలు మోపరాదని, నడవడానికి వీల్లేదని, రెండు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. నడవలేని స్థితిలో రఘురామ స్టెచర్ పై ఉన్న ఫొటో వైరలైంది. సీటీ స్కాన్, ఎమ్మారై తదితర పరీక్షలు కూడా ఆయనకు నిర్వహించారు.

ఫ్యామిలీ తోడుగా ఆస్పత్రికి..
రఘురామ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియాకు ఫోన్లో మాట్లాడి, ఆరా తీసారు. ఎంపీకి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రఘురామను కూడా మంత్రి ఫోన్లో పరామర్శించారు. గాయాలకుగల కారణాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఎయిమ్స్ కు వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు మీడియాతో మాట్లాడేందుకు రఘురామ నిరాకరించారు. ఆస్పత్రిలో ఆయన వెంట సతీమణి రమాదేవి, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, తనయుడు భరత్ ఉన్నారు. ఇదిలా ఉంటే,

రెబల్ కాళ్లకు గాయాలపై..
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కాళ్లకు అయిన గాయాలపై ఏపీ సీఐడీ స్పష్టత ఇచ్చింది. రఘురామకు పోలీసు కస్టడీలోనే గాయాలు అయ్యాయని కానీ, ఆయనకు గాయాలు ఉన్నాయని కానీ సైనిక ఆసుపత్రి ఎక్కడా చెప్పలేదని సీఐడీ పేర్కొంది. రఘురామ గాయాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల రిపోర్టు, కాలికి పీఓపీ కట్లు కట్టిన నేపథ్యంలో కస్టోడియల్ విచారణ అంశం మళ్లీ చర్చనీయాంశం కావడంతో, రిపోర్టుల్లో లేని ప్రచారాలు చేయరాదంటూ సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు సైనిక ఆసుపత్రి సమర్పించిన నివేదికలోనూ ఇదే విషయాన్ని పేర్కొందని గుర్తు చేసింది.

రఘురామపై అలా వద్దన్న సీఐడీ
సికింద్రాబాద్ లోని సైనిక ఆసుపత్రి నివేదికకు ముందే మూడుసార్లు వైద్యులు పరిశీలించి నివేదిక ఇచ్చారని, వాటిలో రఘురామకు గాయాలు అయినట్టు ఎక్కడా చెప్పలేదని ఏపీ సీఐడీ గుర్తుచేసింది. రఘురామను గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరచడానికి ముందు జారీ చేసిన ఫిట్నెస్ ధ్రువపత్రం, గుంటూరు జీజీహెచ్ వైద్యుల బృందం హైకోర్టుకు ఇచ్చిన నివేదిక, గుంటూరు జిల్లా జైలు డ్యూటీ డాక్టర్ ఇచ్చిన నివేదికలోనూ ఎక్కడా రఘురామకు గాయాలు ఉన్నట్టు పేర్కొనలేదని వివరించింది. సైనిక ఆసుపత్రి కూడా ఇదే విషయాన్నిచెప్పిందని, ఆయనకు ఎడిమా ఉందని తప్పితే కస్టడీలోనే గాయాలు అయినట్టు ఎక్కడా పేర్కొనలేదని వివరించింది. కాబట్టి గాయాలు ఉన్నట్టు సైనికాసుపత్రి ధ్రువీకరించిందని తప్పుడు నిర్ధారణలతో ప్రచారాలు చేయడం సరికాదని ఏపీ సీఐడీ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications