నిమ్మగడ్డ అంటే భయమా? సుప్రీం షాకింగ్ తీర్పు -6లక్షలమంది ఏడుపు: ఎంపీ రఘరామ
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా జగన్ సర్కారు తప్పించుకోలేదని, సరిగ్గా ఇలాంటి ప్రయత్నేమే చేసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు సుప్రీంకోర్టులో ప్రతిఘాతం ఎదురైందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. కేవలం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై కోపంతో వ్యవస్థలను, ప్రక్రియను ధిక్కరించడం సరికాదని హితవుపలికారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీకి సంబంధించిన ప్రధాన అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

బుద్ధి లేనిది ఎవరికి?
‘‘స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై గత మార్చిలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ సరైందే. కేవలం వ్యక్తిగత కక్షతో ఎన్నికలు వద్దని వైసీపీ చెబుతుండటం హాస్యాస్పదం. కరోనా గురించి ఏమీ తెలియని రోజుల్లో నిమ్మగడ్డ కాలనుగుణంగా వ్యవహరించారు. ఇవాళ కరోనా పట్ల అందరిలో అవగాహన పెరిగింది. దేశవ్యాప్తంగా రోజూ కొత్త కేసుల సరాసరి 70వేల నుంచి 40 వేలకు తగ్గింది. ఏపీలో గత నెలలో రోజుకు 10వేలు వచ్చిన కేసులు ఇవాళ 3వేల లోపునకు వచ్చాయి. 10 కేసులు ఉన్నప్పుడు వద్దని 10 వేల కేసులప్పుడు ఎన్నికలు పెడతారా అని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలు నిజంగా మేధావులే. బుద్ధి లేదా? అని చంద్రబాబు ప్రశ్నించింది ఎవరినో చూసుకోండి. ఈ విషయంలో..

సుప్రీంకోర్టు మొట్టికాయలు..
ఏపీలో ఆదాయం కోసం మద్యం షాపుల ఓపెన్ చేస్తే, వాటి ముందు రోజూ జాతర నడుస్తోంది. స్కూళ్లు కూడా తెరుచుకున్నాయి. డిసెంబర్ నుంచి చిన్న పిల్లలకు కూడా క్లాసులు పెడుతున్నారు. త్వరలోనే సినిమాహాళ్లను కూడా తెరవబోతున్నారు. వీటన్నింటికీ లేని కరోనా అడ్డండి ఎన్నికలకే ఎందుకు? ఇలానే కరోనాను సాకుగా చూపి, స్థానిక ఎన్నికల్ని వాయిదా వేసేందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రయత్నించారు. కానీ సుప్రీంకోర్టు ఆయనకు మొట్టికాయవేసి ఎన్నికల నిర్వహణకు ఆదేశాలిచ్చింది. ఆ తీర్పును జగన్ కూడా చదవాలి. అటు గుజరాత్ లోనూ స్థానిక ఎన్నికలు నిరాటంకంగా సాగుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎన్నికల వల్ల కరోనా వ్యాప్తి పెరిగిన దాఖలాలేవీ లేవు.

అసలు భయం కరోనానా? నిమ్మగడ్డా?
ఏపీలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తుండటాన్ని జనం వ్యతిరేక దిశలో అర్థం చేసుకుంటున్నారు. జగన్ కు అసలు భయం కరోనానా? నిమ్మగడ్డ రమేశ్ కుమారా? అని చర్చించుకుంటున్నారు. రమేశ్ కుమార్ గురించి వైసీపీ మంత్రులు, నేతలు ఎంత మొత్తుకున్నా చివరికి ఎన్నికలు జరగాల్సిందే. ఎందుకంటే అది రాజ్యాంగ నిర్దేశం. నిమ్మగడ్డ ఉంటే ఏకగ్రీవాలు జరగబోవని వైసీపీ భయపడుతున్నట్లు అనిపిస్తోంది. పథకాల రూపంలో ప్రజలకు వేలకోట్లు పంచుతున్నప్పుడు ఏకగ్రీవాల గురించి భయాలెందుకు? ఎన్నికలంటే జంకు ఎందుకు? హింసకు తావులేకుండా, నిమ్మగడ్డకు జగన్ సంపూర్ణయంగా సహకరిస్తూ జనవరి మూడో వారంలోనైనా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల సంఘం, కోర్టుల ముందు వైసీపీ, జగన్ ఉడత ఊపులు చెల్లబోవని ఇప్పటికైనా గ్రహించాలి. మరో ముఖ్యమైన విషయం..

కరోనా సిబ్బందికి జీతాల్లేవు..
ఓ దిక్కు కరోనా భయంతోనో నిమ్మగడ్డపై కోపంతోనో ఎన్నికల వాయిదా కోరుతూనే.. కరోనా టెస్టుల్లో ఏపీ అగ్రగామిగా ఉందని ప్రభుత్వం చెప్పుకుంటోంది. పెద్ద ఎత్తున వాహనాలను ఏర్పాటు చేసి కరోనా టెస్టులు చేస్తున్నారు. కానీ వాటిలో పనిచేస్తోన్న సిబ్బందికి మాత్రం జగన్ సర్కారు జీతాలు ఇవ్వడంలేదు. మూడు నెలలుగా తమకు జీతాలు రావట్లేదని ఆ ఉద్యోగుల సంఘాలు నాకు చెప్పాయి. ఆయుర్వేదం డాక్టర్లది కూడా అదే పరిస్థితి. సీఎం అందుబాటులోకి రాకపోయేసరికి వారు తమ సమస్యల్ని నాకు తెలియజేశారు. జీతాలే చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంటే.. మరి సంక్షేమ పథకాల సంగతేంటి? అసలే జనం డబ్బులకు అలవాటు పడిపోయారు. వారి భయాలను తొలగించాలి. ఇక..

ఆ 6 లక్షల మందికి దారేది?
కరోనా కారణంగా ఏపీలో 10వ తరగతి పరీక్షల్లో మొత్తం 6 లక్షల మందినీ పాస్ చేసేశారు. ఇప్పుడు వాళ్లంతా ఇంటర్ లో జాయిన్ కవాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో అన్నీ కలిపి 900 కాలేజీలే ఉన్నాయి. మరి ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్లతోపాటు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కొత్తగా 300 కాలేజీలకు అనుమతిచ్చామని, మరో 400 కాలేజీలకు అనుమతులు పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ ప్రకటనలు విద్యార్థుల కన్నీటిని తుడిచేలా లేవు. సీఎం ఆదేశాలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదు. దీనిపై నేరుగా జగన్ జోక్యం చేసుకోవాలి. అదేసమయంలో ఏపీ వరదాయిని పోలవరం ప్రాజెక్టు గురించి మంత్రులు, అనధికార ప్రతినిధులు ఇష్టారీతిగా ప్రకటనలు చేయడాన్ని సీఎం నిరోధించాలి. సదరు ప్రకటనలు ఏపీకి నష్టం కలిగించేలా ఉన్నాయని గుర్తించాలి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.












Click it and Unblock the Notifications