అడ్డంగా దొరికిన విజయసాయిరెడ్డి - మోదీ-జగన్ మధ్య ఉల్కాపాతం -పోలవరం అసలు కథ: ఎంపీ రఘురామ
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మళ్లీ పోలవరంపై సాగుతున్నాయి. ఆ జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. నిందారోపణల సంగతి ఎలా ఉన్నా, ఏపీలో వచ్చే ఎన్నికలకు పోలవరమే ప్రధానాంశం అవుతుందని, కారణాలు ఎంత పెద్దవైనా ప్రాజెక్టును కట్టకుండా వైసీపీ తప్పించుకునే ఛాన్సేలేదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటనలు ఇందుకు తిరుగులేని రుజువులని తెలిపారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరంపై అసలు కథ ఇదంటూ తన వెర్షన్ చెప్పుకొచ్చారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
మోసపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే - ఏపీ సీడ్స్ ద్వారా నకిలీ విత్తనాలు కొని - సీఎం జగన్ దృష్టికి
వైఎస్సార్ హయాంలో వేగంగా..
‘‘ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధత ప్రజలందరినీ వేధిస్తోంది. అసలీ విషయంలో తప్పు ఎవరిదో, సమస్యకు సరైన పరిష్కారం ఏమిటో చెప్పుకునే ముందు, బ్రీఫ్ గా గతాన్ని గుర్తుచేసుకోవడం చాలా అవసరం. వైఎస్సార్ హయాంలో పోలవరం నిర్మాణాన్ని తలపెట్టగా, ఇందిరా సాగర్ పేరిట కెనాల్స్ పనులు యుద్ధప్రాతిపదికన జరిగాయి. అయితే, 2014లో రాష్ట్ర విభజన జరిగి, ఏపీకి అన్యాయం జరిగిన దరిమిలా, దాన్ని పూడ్చడానికి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత తొలి కేబినెట్ భేటీలో ‘పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ)' ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. గతంలో జాతీయ ప్రాజెక్టులు ఎన్నో ఉన్నా.. పోలవరానికి అథారిటీ ఏర్పాటుచేయడం దేశంలోనే తొలిసారి. 2014 ఏప్రిల్ 1 నాటికి అయిన ఖర్చును పక్కనపెట్టి, అప్పటి రేట్ల ప్రకారం మోత్తం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని కేంద్రం ప్రకటించింది. అప్పట్లో దీన్నెవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత..
ప్యాకేజీలో భాగంగా టీడీపీకి..
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2016 సెప్టెంబర్ నాటి కేంద్రం ప్రకటన చాలా కీలకమైనది. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ప్యాకేజీలో భాగంగా.. అప్పటికే టీడీపీ ప్రభుత్వ పలు లేఖలు రాసిన దరిమిలా ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రానికి ఇచ్చేశారు. దీంతో పనులు ఊపందుకున్నాయి. కానీ 2017, మార్చి 15నాటి కేబినెట్ భేటీలో పోలవరానికి కేంద్రం ఇచ్చే మొత్తం రూ.20,393 కోట్లు మాత్రమేనని నిర్ధారణ అయింది. నిజానికి ఈ సమస్యను ఆనాడే పరిష్కరించుకోవాల్సింది. కానీ అప్పుడు టీడీపీ-బీజేపీ మిత్రులు కాబట్టి అడ్జెస్ట్ చేసుకోవచ్చని భావించారు. నాడు ఆ రెండు పార్టీల మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. అదే ఏడాది అక్టోబర్ నాటికి కేంద్ర జల శక్తి శాఖ.. ఏపీ నీటిపారుదల శాఖకు ఒక లేఖ రాసింది.. కేబినెట్ నిర్ణయం ప్రకారం రూ.20వేల కోట్లు మాత్రమే ఇస్తామని కరాకండిగా చెప్పారు. అప్పుడు కూడా టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మరోవైపు జగన్..
జగన్ ప్రశ్నే పోలవరానికి సమాధానం..
2014లో వైసీపీ అధినేత జగన్ ఓ అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘‘పోలవరాన్ని కట్టలేరా? కేంద్ర సాయం లేనిదే రాష్ట్ర సర్కారుకు చేతకాదా?'' అని ప్రశ్నించారు. మరిప్పుడు రాష్ట్ర సర్కారు జగన్ చేతుల్లోనే ఉంది. ‘మరి వైసీపీకి పోలవరం కట్టడం చేతకాదా?' అని ప్రజలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి నాటి తన ప్రశ్ననే జగన్ పోలవరం సమస్యకు సమాధానంగా భావించాలి. నిత్యం ట్వీట్లను ఇష్టపడే వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి సైతం సంచలన ప్రకటన చేశారు. ‘‘పోలవరం సవరించిన అంచనాలల ప్రకారం రూ.55,548 కోట్ల నిధులకు కేంద్రం గ్నీన్ సిగ్నల్ ఇచ్చిందని, ప్రధాని మోదీని సీఎం జగన్ కోరడంతో ఇది సాధ్యమైందని, కానీ లోకేశ్ మాత్రం ఇది తన తండ్రి ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు' అని విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పటికీ ఉంది. మరి అలాంటప్పుడు కేంద్రం తాజాగా ‘20వేల కోట్లు మాత్రమే ఇస్తామ'ని చెబుతుంటంపై వైసీపీ స్టాండ్ ఏంటి? వైఫల్యాలను గత ప్రభుత్వాలపై నెట్టేసి చేతులు దులుపుకొంటారా? దీనికి సరైన పరిష్కారం ఏంటంటే..
మోదీ-జగన్ మధ్య ఉల్కాపాతం
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర-రాష్ట్రాలు గొప్ప అనుబంధంతో ముందుకు సాగుతున్నాయని బిల్డప్పులు ఇస్తున్నారు. కానీ పోలవరం నిధుల అంశం ఇప్పుడొక ఉల్కాపాతంలా తగులుకుంది. దీనికి పరిష్కార ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్ స్థాయిలో జరగాలి తప్ప.. అనిల్ కుమార్ యాదవ్ లేదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్లతో కానేకాదు. 2020 మార్చిలో కూడా(రాజ్యసభ ఎంపీ కేవీపీ అడిగి ప్రశ్నకు కేంద్రం) తాము 20వేల కోట్లే పోలవరానికి ఇస్తామని కుండబద్దులుకొట్టింది. మరి విజయసాయి రెడ్డేమో రూ.55,548 కోట్లకు కేంద్రం సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ఇంత ముఖ్యమైన పాయింటును వదిలేసి మా వైసీపీ నేతలు.. గతంలో తప్పులు జరిగాయని చంద్రబాబును తిడుతూ, పని చేయలేదని నింద నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు..
Recommended Video
కేసీఆర్ బాటలో జగన్..
మార్చి నాటి కేంద్రం ప్రకటనపైగానీ, ఆ తర్వాత మోదీ, అమిత్ షాను జగన్ కలవడంపైగానీ వైసీపీ నేతలు మాట్లాడటం లేదు. జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సరైన పరిష్కారం ఏంటంటే.. అప్పట్లో జగన్ ‘కేంద్రం సహకారం లేకుండా పోలవరం కట్టుకోలేమా?'అని ప్రశ్నించి ఉన్నాడు కాబట్టి, కొంతలో కొంత ఖర్చును భరించడానికి సిద్ధం కావాలి. కేంద్రం ఇస్తానంటోన్న రూ.20వేల కోట్లను ఇంకాస్త పెరిగేలా చూసుకుకోని, మిగతా మొత్తాన్ని రాష్ట్రమే భరించాలి. అందుకోసం జగన్ సర్కారు దుబారాను తగ్గించుకోవాలి. కేవలం జనానికి డబ్బులు పంచితేనే ఓట్లు రావు, అభివృద్ధి కూడా జరగాలి. పోలవరాన్ని పూర్తి చేయకుండా వైసీపీ తప్పించుకోరాదు. పక్కన తెలంగాణలో లోన్లు తీసుకుని మరి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అదే బాటలో జగన్ కూడా నడవాలి. కేంద్రం సహకారం కోరుతూనే తన వంతు బాధ్యత నెత్తికెత్తుకోవాలి. వంకలు పెట్టి తప్పించుకోవడం ఇక కుదరదు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
మళ్లీ నిప్పులుచెరిగిన స్పీకర్ సీతారాం - అప్పుడు వైసీపీకీ టీడీపీ గతే - అచ్చెన్నపై అప్పల్రాజు ఫైర్