బిన్ లాడెన్ తరహాలో అచ్చెన్న అరెస్టు.. వైసీపీ ఎంపీ అనూహ్య కామెంట్లు.. కడప జైలుకు లోకేశ్..
సొంత పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించడమే కాకుండా.. తనపై దుష్ప్రచారం చేస్తోన్న మీడియా సంస్థలపై ఏకంగా లోక్ సభలో ప్రివిలేజ్ మోషన్ కు సిద్ధపడ్డారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. తాను సీఎం జగన్ కు విధేయుడిగానే ఉంటానని ఇటీవల పలు మార్లు స్పష్టం చేసిన ఆయనే.. మరోసారి సొంత సర్కారు తీరుపై అనూహ్య వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు, జేసీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు నారా లోకేశ్ కడపకు రానుండటంతో ఒకింత టెన్షన్ నెలకొంది.

అచ్చెన్న అరెస్టుపై..
ఏపీలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో రూ.900 కోట్ల అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి, ప్రస్తుత టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేయడం తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఖైదీ నెంబర్ 1573గా అచ్చెన్నను విజయవాడ జైలుకు తరలించారు. అయితే, కొద్ది రోజుల కిందటే ఆయనకు పైల్స్ ఆపరేషన్ జరగడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఉదంతంపై వైసీపీ ఎంపీ కృషంరాజు.. ఆదివారం ఓ టీవీ చానెల్ లో మాట్లాడుతూ.. పోలీసులు అతిగా ప్రవర్తించారని అన్నారు.

లాడెన్ తరహాలో గోడదూకి..
‘‘అచ్చెన్నాయుడు అరెస్టుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను నేను చూశాను. 409, 120బీ, 420 సెక్షన్ల కింద కేసులు వేశారు. అందులో 409 సెక్షన్.. నేరపూరిత కుట్ర కాబట్టి.. నోటీసు ఇవ్వకుండానూ అరెస్టు చేసే అవకాశముంది. అయితే రెండ్రోజుల ముందే సర్జరీ చేయించుకున్న వ్యక్తిని పోలీసులు అలా బలవంతంగా అరెస్ట్ చేయాల్సిన అవసరంలేదేమో. సినీ ఫక్కీలో అచ్చెన్న ఇంటి గోడ దూకి మరీ.. ఒసామా బిన్ లాడెన్ తరహాలో అరెస్ట్ చేయాల్సిన అవసరమైతే లేదు. అవినీతిపరులపై చర్చలు మంచిదేకానీ.. ఇంత నాటకీయత అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం''అని ఎంపీ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

ఇదే తీరుకు ఆ పార్టీలో బహిష్కరణ..
అచ్చెన్నాయుడి అరెస్టు విషయంలో పార్టీ లైన్ కు విరుద్ధంగా.. టీవీ చానెళ్లలో మాట్లాడిన ముగ్గురు కీలక నేతలపై ఏపీ బీజేపీ చర్యలకు దిగడం సంచలనం రేపింది. అచ్చెన్న, జేసీ ప్రభాకర్ రెడ్డి సహా అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరి అరెస్టునూ బీజేపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పదే పదే స్పష్టం చేసినా.. బీజేపీ నేతలు లక్ష్మీపతి రాజు, కిలారు దిలీప్, రామకోటయ్య మాత్రం అచ్చెన్న అరెస్టు తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో లక్ష్మీపతి రాజుపై సస్పెన్షన్ వేటు, దిలీప్, రామకోటయ్యలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కామెంట్లకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే ఈ ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తామని ఏపీ బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే..

హైడ్రామా.. లోకేశ్ రాక..
అక్రమంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులు నడపడం, ఫోర్జరీ పత్రాలు సృష్టించడం తదితర ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేయడం.. అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య వాళ్లను కడప సెంట్రల్ జైలుకు తరలించడం తెలిపిందే. తొలుత వీరిని అనంతపురం జైలుకు పంపాలనుకున్నా.. అక్కడ కరోనా లక్షణాలున్న ఖైదీలు కొందరు ఉండటంతో జైలు అధికారులు వీరిని లోనికి రానిచ్చేందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత జడ్జి అనుమతితో తాడిపత్రి జైలుకు తీసుకెళ్లాలనుకున్నా.. శాంతిభద్రతల సమస్య ఏర్పొడొచ్చనే ఉద్దేశంతో చివరికి జేసీ కుటుంబాన్ని కడపకు తీసుకెళ్లారు. వాళ్లను పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప జైలుకు బయలుదేరారు.

కడపలో టెన్షన్..
టీడీపీ నేత నారా లోకేశ్.. తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని, సడెన్ గా కడప టూర్ కు సిద్ధమయ్యారు. శనివారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు కడప జైలుకు తరలించడంతో తాను కూడా కడపకే వెళ్లాలని లోకేశ్ డిసైడ్ అయ్యారు. పార్టీ చీఫ్ చంద్రబాబు ఆదేశాల మేరకే లోకేశ్.. జేసీ ఫ్యామిలీని పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు కడప వెళతారని పార్టీ శ్రేణులు తెలిపారు. కాగా, లోకేశ్ పర్యటన నేపథ్యంలో కడపలో ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొంది. జైలు వద్ద బందోబస్తును పటిష్టం చేసిన పోలీసులు.. అదనపు సిబ్బందిని మోహరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications