అదే గనుక నిజమైతే.. జగన్ జైల్లో ఉండేవాడా?.. బాబు ఒక అసమర్థుడు: వైసీపీ ఎంపీ
న్యూఢిల్లీ/విజయవాడ: ఓవైపు కేంద్రాన్ని నిలదీస్తూనే మరోవైపు ప్రతిపక్ష పార్టీ తీరును ఎండగడుతోంది టీడీపీ. వైసీపీ గుంట నక్క వేషాలేస్తోందని సీఎం చంద్రబాబు ఇప్పటికే విమర్శించగా.. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను, దేశంలో పార్లమెంట్ సమావేశాలను బాయ్కాట్ చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ వరప్రసాదరావు ఈ విమర్శలను తిప్పికొట్టి ప్రయత్నమే చేశారు. టీడీపీ ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

అదే గనుక నిజమైతే.. :
కాంగ్రెస్ అధినేతతో తమ నాయకుడు కుమ్మక్కయ్యాడన్న ఆరోపణలను ఎంపీ వరప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. అదే గనుక నిజమైతే.. గతంలో సిల్లీ కారణాలతో 16నెలలు జైల్లో ఉండేవారు కాదన్నారు. లేని వ్యక్తి గురించి సభలో మాట్లాడటం సరికాదని ఆయన సూచించారు. బడ్జెట్పై చర్చలో భాగంగా తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని వైసీపీ ఎంపీలు కోరడంతో స్పీకర్ వారికి అవకాశం ఇచ్చారు.

రికార్డుల నుంచి తొలగించాలని..:
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ ఎంపీలు చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా వరప్రసాదరావు కోరారు. దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్.. అభ్యంతరకర వ్యాఖ్యలు గనుక ఉంటే తర్వాత తొలగిస్తామని చెప్పారు.

చంద్రబాబు అసమర్థుడు:
కేంద్రంలో మిత్రపక్షమై ఉండి.. ఇటు రాష్ట్రంలో నాలుగేళ్లుగా అధికారంలో ఉండి.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏవిధమైన ప్రయోజనం చేకూర్చలేకపోయారని వరప్రసాదరావు ఆరోపించారు. చంద్రబాబు ఒక అసమర్థ ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు.

సీబీఐతో విచారణ జరిపించండి..:
ఏపీ పున:వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామిలను కేంద్రం చేత అమలు చేయించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వరప్రసాదరావు ఆరోపించారు. రాష్ట్రంలో పట్టిసీమ ప్రాజెక్టులో తీవ్ర అవినీతి అవకతవకలు చోటు చేసుకున్నాయన్నారు. కాగ్ కూడా దీన్ని తప్పు పట్టిందని.. కాబట్టి సీబీఐ చేత ఈ ప్రాజెక్టు పనులపై విచారణ జరిపించాలని వరప్రసాదరావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications