రోజాకు బికినీ కామెంట్స్-సాయిరెడ్డి కౌంటర్ అటాక్-మీ వాళ్లూ ఇలాగే కనిపిస్తారా అంటూ ట్వీట్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయాల్లో తాజాగా ఎమ్మెల్యే రోజాకు జగన్ కేబినెట్ ప్రక్షాళనలో మంత్రి పదవి దక్కడం, ఆ తర్వాత ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ కు చీరలు పంపిస్తానంటూ రెచ్చిపోవడం, దానికి కౌంటర్ గా టీడీపీ నేతలు ఆమెకు బికినీలు పంపుతామంటూ కౌంటర్ అటాక్ కు దిగడం వరుసగా జరిగిపోయాయి. దీనిపై కొద్దిరోజులు దుమారం రేగినా ఆ తర్వాత రోజా స్పందించకపోవడంతో ఇది కాస్తా సద్దుమణిగింది. ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీన్ని మళ్లీ కెలికారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై అదను దొరికినప్పుడల్లా ట్వీట్లు పెట్టే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకూ చంద్రబాబును లింక్ చేస్తూ ఇవాళ ట్వీట్ చేశారు. అదీ టీడీపీ నేతలు రోజాపై ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేసి వారం రోజులు కావస్తుంటే ఇవాళ సాయిరెడ్డి ఈ ఘటనలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ పెట్టారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ పై చర్చ జరుగుతోంది.
విజయసాయిరెడ్డి ఇవాళ పెట్టిన ట్వీట్ లో " స్త్రీల పట్ల తన నికృష్ట భావనను మరోసారి బైట పెట్టుకున్నారు బాబు. సీఎం జగన్ గారి ప్రోత్సాహం, ప్రతిభతో మంత్రిస్ధాయికి ఎదిగిన మహిళకు బికినీ పంపిస్తామని హేళన చేస్తారా ? ఎంతో మంది ప్రభావ శీల మహిళలు రాజకీయాల్లో సేవ చేస్తున్నారు. మీ బంధువులు కూడా ఉన్నారు. వారంతా ఇలాగే కనిపిస్తారా ? అని సాయిరెడ్డి ట్వీట్ లో ప్రశ్నించారు.
వాస్తవానికి చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను మంగళగిరిలో గెలిపించుకోలేకపోయారని, అందుకే ఆయనకు చీరలు పంపిస్తానంటూ ఏ చీర కావాలంటూ మంత్రి రోజా తాజాగా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన టీడీపీ నెల్లూరు నేత ఆనం వెంకట రమణారెడ్డి మాకు చీరలు పంపుతావా , నీకు నీ స్ధాయికి తగ్గట్టు బికినీలు, లిప్ స్టిక్, కట్ డ్రాయర్లు పంపుతానంటూ రెచ్చిపోయారు. దీంతో ఆనం వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇవి సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి తన ట్వీట్ లో చంద్రబాబును దీనిపై టార్గెట్ చేశారు.