మోడీతో విజయసాయిరెడ్డి భేటీ-ఏపీ సమస్యలపై సుదీర్ఘ చర్చ-ఏం మాట్లాడారంటే ?
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత మోడీని కలిసిన విజయసాయిరెడ్డి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలతో పాటు రాజకీయ అంశాలు, తాజా పరిణామాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పార్లమెంట్లోని ఆయన కార్యాలయంలో విజయసాయిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లేవెనెత్తిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చి వాటి సత్వర పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా ఆయనను కోరారు. అలాగే ఏపీకి గతంలో ఇచ్చిన విభజన హామీల్ని అమలు చేసేందుకు కృషిచేయాలని కోరారు. దీనిపై విజయసాయిరెడ్డి అనంతరం ట్వీట్ చేశారు. ప్రధానితో దిగిన ఫొటోల్ని కూడా ఈ ట్వీట్ కు జత చేశారు.
ఏపీకి విభజన హామీలైన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై కేంద్రం చేతులెత్తేసింది. మరో కీలక హామీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ సహకరించడం లేదు. పోలవరం ప్రాజెక్టు అంచనాల విషయంలో రెండేళ్లుగా పోరాడుతున్నా కేంద్రం స్పందించడం లేదు. సాంకేతిక అంశాల్నిసాకుగా చూపుతూ కాలయాపన చేస్తోంది. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలోగా పూర్తి కావడం కష్టమేనని కేంద్రమే పార్లమెంటులో తేల్చిచెప్పేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై ప్రధాని మోడీతో విజయసాయిరెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మోడీ వీటిపై ఎలా స్పందించారన్న దానిపై మాత్రం విజయసాయిరెడ్డి ట్వీట్ లో ప్రస్తావించలేదు.
సీఎం జగన్ కూడా ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళ్లలేదు. ఢిల్లీ వెళ్తారని పలుమార్లు ప్రచారం జరిగినా ప్రధాని మోడీ, అమిత్ షా అపాయింట్ మెంట్లు దొరకలేదు. దీంతో విజయసాయిరెడ్డిని పార్లెమంటు సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రధాని నుంచి ఏపీ సమస్యల పరిష్కారంపై ఆయనకు ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. దీంతో వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే సర్కార్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు.