టీడీపీని ఇలా ఎదుర్కోండి- వైసీపీ లాయర్లకు విజయసాయిరెడ్డి దిశానిర్దేశం
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ లో న్యాయవాదుల పాత్ర చాలా కీలకంగా మారిపోయింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని అనుక్షణం కోర్టుల్లో ప్రశ్నిస్తూ విపక్షాల న్యాయవాదులు దాఖలు చేస్తున్న పిటిషన్లు, వాటిని ఎదుర్కొనేందుకు వైసీపీ పడుతున్న కష్టాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ తమ పార్టీకి చెందిన న్యాయవాదులతో నిర్వహించిన లీగల్ సెల్ సదస్సులో కీలక దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను అడ్డుకుంటామని ఓపెన్గా చెప్పి మరీ, ప్రతిపక్ష తెలుగుదేశం కోర్టులకు వెళ్ళి ప్రతి దానిపై స్టేలు తీసుకొస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. న్యాయ వ్యవస్థను, మీడియా వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాజకీయ వ్యవస్థను టీడీపీ బ్రష్టు పట్టిస్తుందని అన్నారు. న్యాయమూర్తులను దూషించకుండా... న్యాయ వ్యవస్థను కించపరచకుండా... న్యాయబద్ధంగానే ఈ చర్యలను ఎదుర్కోవడం ద్వారా నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత న్యాయవాదులపైనే ఉందని ఆయన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులకు దిశా నిర్ధేశం చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయసాయిరెడ్డి .. హక్కుల కోసం బాధ్యతాయుతంగా పోరాడే వారే న్యాయవాదులని పేర్కొన్నారు. అలాంటి న్యాయవాదులకు నాయకులుగా ఉన్న మీరంతా శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలలో కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ దిశగా దృష్టి సారించి లీగల్ సెల్ను మరింత బలోపేతం చేయాలని కోరారు. బార్ కౌన్సిల్తో సహా రాష్ట్రంలో ఉన్న 143 బార్ అసోసియేషన్లలో మన పార్టీకి చెందిన లీగల్ సెల్ నాయకులే పట్టు సాధించాలని సూచించారు. తద్వారా న్యాయ వ్యవస్థలో మరింత క్రియాశీలకం కావాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఏ ప్రజోపయోగ కార్యక్రమం చేపట్టినా.. ప్రతిపక్షం అందుకు అడ్డుపడుతోందని సాయిరెడ్డి తెలిపారు. స్టేలు, కేసులతో వేధిస్తోందన్నారు. మీడియాలోని కొన్ని సంస్థలు కూడా ప్రతిపక్షం కొమ్ము కాస్తున్నాయని, రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందనీ, త్వరలోనే మరో శ్రీలంక కాబోతోందనీ... ఇటువంటి దుష్ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిర పరిచే పన్నాగాలు పన్నుతోందన్నారు. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్య ప్రవేశపెడితే... కోర్టుకు వెళ్ళారని విమర్శించారు. పేదలకు ఇళ్ళు ఇద్దామన్నా... కోర్టును ఆశ్రయించి అడ్డుకుంటున్నారన్నారు. ఇక నవరత్నాలపై నిత్యం కేసులు వేస్తూనే ఉన్నారని గుర్తుచేశారు.నిరర్ధక ఆస్తులు అమ్మి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేద్దామన్నా చేయలేని పరిస్థితి ఉందన్నరాు. వాలంటీర్ల వ్యవస్థతో పరిపాలనను ప్రజల ముంగిటకు చేరుస్తుంటే అక్కడా అడ్డం పడుతున్నారన్నారు. ఆఖరికి టీటీడీ ట్రస్టు బోర్డు నియామకంపై కూడా వారు కోర్టు కెక్కి రచ్చ చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లోనూ కోర్టులు జోక్యం చేసుకునేలా ప్రతిపక్షం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. దీన్ని మనం సమిష్టిగా తిప్పికొట్టినప్పుడే అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండేళ్ళలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా మహాసభలు జరపడం లీగల్సెల్ ముందున్న తక్షణ కర్తవ్యమని విజయసాయిరెడ్డి తెలిపారు. జులై 8వ తేదీన జరుగనున్న పార్టీ ప్లీనరీలోపల అన్ని జిల్లాల్లో మహాసభలు నిర్వహించాలని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రతిపక్షం విష ప్రచారాన్ని ఎదుర్కొనే క్రమంలో న్యాయపరమైన చిక్కులకు ఆస్కారం లేకుండా సోషల్మీడియాతో అనుసంధానమై ముందుకు సాగాలని వి.విజయసాయిరెడ్డి లీగల్ సెల్ నేతలకు పిలుపునిచ్చారు.