చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్, పార్టీలేదు బొక్కా లేదు, ఉమా..సిఐడీ ముందు బొంకావా ?లేదా ? సాయిరెడ్డి వ్యంగ్యం
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, కేఏ పాల్,దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. కేఏ పాల్ ను చంద్రబాబుకు శిష్యుడు అంటూ,గురువును మించి డ్రామాలు ఆడుతున్నాడు అంటూ చురకలంటించారు. ఇటీవల కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షల రద్దు కోరుతూ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ సర్కార్ పై విరుచుకు పడుతున్నారు. దీంతో అటు కేఏ పాల్ ను,ఇటు చంద్రబాబును టార్గెట్ చేశారు విజయసాయి రెడ్డి.ఇక వీడియో మార్ఫింగ్ కేసులో సిఐడీ విచారణ ఎదుర్కొంటున్న ఉమాను టార్గెట్ చేశాడు.
సిఐడి విచారణలో ఉమా కొత్త స్టోరీ, చంద్రబాబు పత్తిగింజనా.. పచ్చమాఫియా అంటూ సాయిరెడ్డి ధ్వజం
గురువు చంద్రబాబు కేఏ పాల్ ను పురమాయించాడా?
చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్ గురువును మించి డ్రామాలాడుతున్నారని, కరోనా సమయంలో దీక్షలు చేయాలని గురువు చంద్రబాబు అతని పురమాయించాడా? అంటూ సెటైర్లు వేశారు. కేఏపాల్ సందట్లో సడేమియా అంటూ లోకేశంకు పోటీగా బయల్దేరాడు అని, అద్దె మైకు కదా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని విమర్శించారు. ఇదే సమయంలో కేఏ పాల్ ను రంగంలోకి దించింది చంద్రబాబేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.
సొంతమనుషులే 'పార్టీ లేదు బొక్కాలేదు'అని గోచీ పీకి వెళ్ళిపోతారు
వ్యూహరచనలో చాణిక్యుడు అంతటివాడని భ్రమపడుతుంటారు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి,అందుకే ఏ పనికి ఏ పార్టీ వాళ్ళను వాడాలో వారిని ప్రయోగిస్తాడు. ఫిర్యాదులు,దీక్షలు చేయిస్తాడు. దీని వల్ల ఒరిగేదేమీ లేదని అర్థం చేసుకునే లోపు సొంతమనుషులే 'పార్టీ లేదు బొక్కాలేదు'అని గోచీ పీకి వెళ్ళిపోతారు అంటూ సెటైర్లు వేశారు.అంతేకాదు కోవిడ్ కష్టకాలంలో ఇష్టమొచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్ లో చాలావరకు చంద్రబాబు సన్నిహితులవే. ప్రభుత్వం తనిఖీలు చేస్తుంటే మూసివేస్తామని బెదిరిస్తున్న ఈ హాస్పిటల్ యజమానులకు నచ్చచెప్పే బాధ్యతను బాబు తీసుకోవాలి.
నమ్మశక్యం కాని అబద్దమాడి పరువు తీసుకున్నావు కదా ఉమా
ఎక్కడో కూర్చొని తమాషా చూడడం కాదు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో దేవినేని ఉమాను సైతం టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ప్రాణం పోయినా సరే పోరాడుతాం అన్న వాడివి.నమ్మశక్యం కాని అబద్దమాడి పరువు తీసుకున్నావు కదా ఉమా అంటూ విరుచుకుపడ్డారు. మార్ఫింగ్ వీడియో చూపిన ట్యాబ్ తిరుపతిలో పోయిందా ? పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు ..ఇప్పుడు సిఐడి అధికారుల చెవిలో పువ్వు పెట్టాలని చూస్తే టెక్నాలజీ నిన్ను వదిలి పెడుతుందా? అంటూ దేవినేని ఉమను టార్గెట్ చేశారు.
మార్ఫింగ్ వీడియో ఉన్న ట్యాబ్ తిరుపతిలో పోయిందని బొంకావా లేదా ?
అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు ఏడ్చినట్టుంది ఉమా వ్యవహారం అంటూ మండిపడిన విజయసాయిరెడ్డి మార్ఫింగ్ వీడియో ఉన్న ట్యాబ్ తిరుపతిలో పోయిందని సిఐడి అధికారుల ముందు బొంకినందుకు కాదంట.. దాన్ని బయట ఎలా పెడతారని శివాలెత్తుతున్నాడు అంటూ ఉమా పై మండిపడ్డారు . లోపల ఒకటి బయట ఒకటి ఎందుకు .. అలా అన్నావా లేదా ?అది చెప్పు ముందు అంటూ దేవినేని ఉమాను ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.
బాధ్యత లేకుండా ఎక్కడో దాక్కుని రాళ్ళు విసిరితే ఎలా బాబు?
ఇదే సమయంలో పరిపాలన వికేంద్రీకరణ కు సీఎం జగన్ గారు పంచాయతీలను బలోపేతం చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. కరోనా రోగుల గుర్తింపు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వీరి సేవలను దేశమంతా ప్రశంసించింది .ఇంతకంటే గొప్ప ఆలోచనలు ఉంటే చెప్పే బదులు బాధ్యత లేకుండా ఎక్కడో దాక్కుని రాళ్ళు విసిరితే ఎలా బాబు అంటూ చంద్రబాబును విమర్శించారు విజయసాయిరెడ్డి.అలాగే చంద్రబాబు ప్రజలకు మేలు చేయడం అంటే నక్కజిత్తులను దూరం చేయాలని ఆశించడం లాంటిది. ఇక లోకేష్ తెలివిగా ఏదో మాట్లాడుతాడు అని ఆశించటం, కాకి కోకిలలా పాట పాడుతుంది అని ఆశించటం లాంటిది అంటూ సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి.