నో పాలిటిక్స్: విజయసాయి రెడ్డి కొత్త ట్విట్టర్ అకౌంట్ ఓపెన్: ఎందుకో తెలుసా?: వాటికి మాత్రమే
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటానికి ఆయన తన సోషల్ మీడియాను మెయిన్ ప్లాట్ఫాంగా వినియోగిస్తుంటారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా ఆ పార్టీ నాయకులపై సెటైర్లను సంధిస్తుంటారు. ఈ విషయంలో ఆయన ప్రధాన అస్త్రం.. ట్విట్టర్.
తన పేరు మీద, తాను సొంతంగా హ్యాండిల్ చేస్తోన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోతుంటారు. తాజాగా- మరో ట్విట్టర్ అకౌంట్ను ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. @OfficeofVsr పేరుతో ఈ అకౌంట్ను ఓపెన్ చేశారు. ఈ విషయాన్ని సాయిరెడ్డి వెల్లడించారు. కొత్త ట్విట్టర్ అకౌంట్లో మాత్రం ఎలాంటి పాలిటిక్స్ ఉండబోవని స్పష్టం చేశారు. ఫిర్యాదులు, వినతిపత్రాలను స్వీకరించడానికి మాత్రమే దాన్ని పరిమితం చేసినట్లు చెప్పుకొచ్చారు.
పార్టీ పరంగా గానీ, నియోజకవర్గాల నుంచి గానీ ఎలాంటి ఫిర్యాదులు లేదా, వినతిపత్రాలను అందజేయాలనుకున్నా ఆ సమాచారాన్ని కొత్త అధికారిక ట్విట్టర్ అకౌంట్కు తెలియజేయవచ్చని సాయిరెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులు, సమస్యలను లేదా ఇతర సమాచారాన్ని కొత్త ట్విట్టర్ ద్వారా తనకు తెలియజేయవచ్చని ఆయన సూచించారు. ఫలితంగా ఆయా సమస్యలను పరిష్కరించడానికి వీలు కలుగుతుందని అన్నారు.
అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకపోవడం, గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో వేగవంతంగా పూర్తికాకపోవడం, గ్రామ సచివాలయాల్లో ఎదురయ్యే సమస్యలను ఈ ట్విట్టర్ ద్వారా తన దృష్టికి తీసుకుని రావొచ్చని చెప్పారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి సోషల్ మీడియాను ఓ వేదికగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజా సేవకుడిగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో నెలకొనే జాప్యాన్ని నివారించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.