మోడీకి అనుకూలంగా సాయిరెడ్డి: చంద్రబాబు-రాహుల్ గాంధీ మధ్య: మీడియా పెద్దల భేటీపై
అమరావతి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన హైదరాబాద్ పర్యటన- రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ డిబేట్కు దారి తీసింది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తెలంగాణ రాజకీయాలను ఇప్పటి నుంచే వేడెక్కించినట్టయింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి-కాంగ్రెస్ మధ్య వాడివేడిగా మాటల యుద్ధానికి కారణమైందీ పర్యటన.
అదే సమయంలో- రాహుల్ గాంధీ తెలుగు మీడియా అధినేతలతో భేటీ కావడం.. ఆయన పర్యటనను మరింత ఆసక్తికరంగా మార్చివేసింది. ఇదివరకెప్పుడూ రాహుల్ గాంధీ- ప్రత్యేకంగా ఏ మీడియా పెద్దలనూ కలుసుకోలేదు. జాతీయ స్థాయిలో ప్రత్యేక ఇంటర్వ్యూల్లో కనిపించారే తప్ప ఇలా ఓ హోటల్లో గెట్ టుగెదర్ తరహాలో వారితో సమావేశమైన సందర్భాలు లేవు. అలాంటిది ఓ ప్రాంతీయ మీడియా పెద్దలను రాహుల్ గాంధీ స్వయంగా కలుసుకోవడం పలు ప్రశ్నలను లేవనెత్తింది.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణాలో రాహుల్ గాంధీని కలుసుకున్న వారిలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు, సీవీఆర్ ఛానల్ అధినేత సీవీ రావు, రవిప్రకాష్ ఉన్నారు. ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారనే ముద్ర ఉంది ఆ మీడియా పెద్దలందరిపైనా. కాంగ్రెస్కు బద్ధ వ్యతిరేకలు అనే పేరు కూడా వారిపై ఉంది. ప్రత్యేకించి- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పని చేశాయనే ప్రచారం ఇప్పటికీ ఉంది.
అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాను లక్ష్యంగా చేసుకుని తరచూ విమర్శలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి మీడియా పెద్దలను రాహుల్ గాంధీ స్వయానా కలుసుకోవడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ భేటీపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎలా అధికారం నుంచి తప్పించాలనే వ్యూహాలపై చర్చించారని ఆరోపించారు. అర్ధరాత్రి తాజ్ కృష్ణాలో క్షుద్రవ్యూహాలను పన్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి దళారులుగా వారంతా ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఎల్లో మీడియా ప్రముఖులందరూ తమ వ్యాపార విభేదాలను సైతం పక్కన పెట్టి ఏకం అయ్యారని ధ్వజమెత్తారు.