వీడియో: నిన్న సముద్ర గర్భంలో..నేడు ఆకాశంలో: విజయసాయి రెడ్డి అడ్వెంచర్ టూరిజం
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరో రిస్కీ ఫీట్ చేశారు. ప్రస్తుతం ఆయన అండమాన్ నికోబార్లో విహరిస్తోన్నారు. రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్న ఆయన అండమాన్ సముద్ర తీర ప్రాంతంలో సాహసకృత్యాలు చేస్తోన్నారు. తన అండమాన్ పర్యటనను అడ్వెంచర్ టూరిజంగా మార్చుకున్నారు. రాజకీయలు, ఎత్తుకు పైఎత్తులు, వ్యూహ-ప్రతివ్యూహాలతో రోజూ తీరిక లేకుండా గడిపే సాయిరెడ్డి వాటన్నింటినీ పక్కన పెట్టారు. ఉల్లాసంగా గడుపుతున్నారు.
మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. తన కుటుంబంతో కలిసి థాయ్లాండ్ పర్యటనకు వెళ్లొచ్చారు. దీనిపై ఆ పార్టీ నాయకులు ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు. అలాగనీ తోసిపుచ్చనూ లేదు. పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడం వల్ల దానికి పార్టీ నాయకులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. సుమారు వారం రోజుల పాటు చంద్రబాబు థాయ్లాండ్లో విహరించారు. ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తోన్నారు.
కొద్దిరోజుల కిందటే- వైఎస్ఆర్సీపీకే చెందిన తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కూడా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. గుల్మార్గ్లో విహరించారాయన. ఈ శీతాకాలంలో ఆయన గుల్మార్గ్లో గడిపారు. మైనస్ డిగ్రీల టెంపరేచర్ గల వాతావరణంలో ఎంజాయ్ చేశారు. గుల్మార్గ్ మంచుకొండల మధ్య విహరించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వైరల్గా మారాయి. ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి.. అండమాన్లో సాహసకృత్యాలు చేస్తోన్నారు.
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన వెంటే విజయసాయి రెడ్డి- అండమాన్కు వెళ్లారు. సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది. 64 సంవత్సరాల వయస్సులో ఆయన సముద్రంలో గడిపారు. ఉపరితలం నుంచి సుమారు 12 మీటర్ల పాటు ఆయన సముద్ర గర్భంలోకి వెళ్లారు. కొన్ని నిమిషాలు అక్కడే గడిపారు.
Experienced the Parasailing in Andaman Sea today 7th January 2022. One long pull from the boat took me to such height, that I could see the real beauty of the sea. There is a lot one can see and learn in Andaman. pic.twitter.com/Xi2sEvUHZg
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 7, 2022
ఇప్పుడు తాజాగా- పారా సెయిలింగ్ చేశారు. అండమాన్ సముద్ర తీరంలో పారా సెయిలింగ్ చేస్తూ కనిపించారు. గంటకు 40 నాటికల్స్ మైళ్ల వేగంతో వెళ్లే స్పీడ్బోట్కు అమర్చిన పారాచూట్ ద్వారా కొన్ని మీటర్ల ఎత్తున ఆయన గాల్లోకి ఎగిరారు. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేశారు. అండమాన్ పర్యటన ఓ అనిర్వచనీయమైన అనుభూతిని మిగిలిస్తుందంటూ చెప్పుకొచ్చారు. అండమాన్లో చూడాల్సింది.. నేర్చుకోవాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు.