చంద్రం .. రేపు కరోనాపై కరాటే అంటారేమో?ప్లాన్ బీ సొల్లు, అదో అంతులేని వ్యథ: సాయిరెడ్డి సెటైర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ధ్వజమెత్తిన టిడిపి నాయకులపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడిన విజయసాయిరెడ్డి కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, తమిళనాడు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉందని, ఢిల్లీలో 25 శాతం పాజిటివిటీ రేటు ఉందని ఒక్క ఏపీ లోనే కేసులు పెరిగిపోతున్నాయి అంటూ ఎల్లో వైరస్ ప్రచారం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తోంది ఏపీ అని దానికి తెలియదా అంటూ టిడిపి నేతలను ఎల్లో వైరస్ అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

చంద్రం కు ఒక వారం అధికారమిస్తే కరోనాని ఖతం చేస్తారంట
యనమల రామకృష్ణుడును టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి యనమలా! నీకన్నా ఎనుములు చాలా బెటర్ అని జ్యోతిలో రాసిన నీ ఆర్టికల్ బట్టి అర్థమవుతుంది. తాండవ నది ఎవరు తొక్కేశారో తుని ప్రజలు తేల్చేశారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి బాగా తెలుసు. పచ్చ మీడియాలో పదే పదే అబద్దాలు ప్రచారం చేస్తే నమ్మే స్థితిలో జనాలు లేరు. టైంపాస్ కి మరో దిగ్గజ విశ్లేషకుడు దొరికాడు అంటూ సెటైర్లు వేశారు. ఇదే సమయంలో చంద్రం కు ఒక వారం అధికారమిస్తే కరోనాని ఖతం చేస్తారంటూ నేతలు డబ్బా కొడుతున్నారన్నారు.

రేపు కరోనాపై కరాటే చేస్తాం అంటారేమో?
రేపు కరోనాపై కరాటే చేస్తాం అంటారేమో? దోమలపై దండయాత్ర ,నీరు చెట్టు స్కీమ్ అంటూ కోట్లు బొక్కేశారు .రెండు రెయిన్ గన్లు తెచ్చి కరువును ఖతం చేశామన్నారు. ఇవన్నీ చూసే ప్రజలు మిమ్మల్ని పాతాళంలో పాతరేశారు అంటూ ధ్వజ మెత్తారు విజయసాయిరెడ్డి. బాబు జూమ్ సొల్లును గతంలో వందల కోట్ల ప్రయోజనం పొందిన ఎల్లో మీడియా తప్ప ఎవరూ ఫాలో అవడం లేదన్నారు. అదేదో అధికారులకు డైరెక్షన్లిచ్చే సీరియస్ మీటింగుల్లా బిల్డప్పులు. ఖాళీగా కూర్చుంటే వ్యాధులు ముదిరిపోతాయని సైకియాట్రిస్టులు చెప్పిన మీదటే తనకు తాను వర్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నుండి ఆపసోపాలు పడే బదులు ఆ పని చెయ్యొచ్చు కదా!!
అప్పట్లో వేల కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను దోచిపెట్టిన 'మన వాళ్ల' ఆసుపత్రుల్లో పేదలకు కొన్ని బెడ్లు ఇప్పించవచ్చుగదా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. హైదరాబాద్ నుంచి ఆపసోపాలు పడేబదులు ఆ పని చేయొచ్చు అని సలహా ఇచ్చారు. రోగుల ప్రాణాలు పోతే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయొచ్చన్న కుత్సిత బుద్ధి తప్ప సాయం చేయాలన్న ఆలోచనే రాదు కదా అంటూ మండిపడ్డారు. అంతేకాదు దోపిడి దొంగలకూ ప్లాన్-ఏ, ప్లాన్-బి లు ఉంటాయి. ఇది కాకపోతే అది అని ముందే అనుకుంటారట. బాబూ అంతే అంటూ విమర్శించారు.

ప్లాన్ బీ సొల్లు.. అదో అంతులేని వ్యధ
జగన్ గారు 4.08 కోట్ల వ్యాక్సిన్ డోసులకు 2 వారాల క్రితమే ఆర్డర్ పెట్టారు గదా అంటే, ఆరు నెలల క్రితమే ఆర్డర్ చేయొచ్చు గదా అంటాడు. ప్లాన్-బి సొల్లు. అదో అంతులేని వ్యథ అంటూ విజయ సాయి రెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు అడవిలో ఉండే అన్ని ప్రాణాంతకమైన జీవుల కంటే డేంజర్ అంటూ దానికి ఉదాహరణగా ఒక కథ చెప్పారు విజయసాయిరెడ్డి. 14 ఏళ్లు అధికారంలో ఉండి, చంద్రబాబు సీఎంగా ఉండి వైద్య ఆరోగ్య శాఖలో ఏం మార్పులు తెచ్చారో చెప్పాలని, ఆయన వెలగబెట్టింది ఇది అంటూ చంద్రబాబు హయాంలో ఆసుపత్రిలో దారుణ పరిస్థితులను కొన్నింటిని పోస్ట్ చేశారు విజయసాయిరెడ్డి.
Recommended Video

రాష్ట్రంలో ఫీవర్ సర్వే ... వ్యాక్సినేషన్ చురుగ్గా .. సాయిరెడ్డి స్పష్టం
ఇదే సమయంలో రాష్ట్రంలో ఫీవర్ సర్వే ప్రారంభం అయిందని, కరోనా బాధితులను ముందస్తుగా గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి జ్వర పరీక్షలు చేయాలని జగన్ వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోందని , కేంద్రం నుంచి వచ్చే వాటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తోందన్నారు . రాష్ట్రంలో మే 6 నాటికి 70 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications