బీసీలకు రిజర్వేషన్లు ఇలా ఇవ్వండి- రాజ్యసభలో కేంద్రానికి సాయిరెడ్డి కీలక వినతి !
ప్రస్తుతం ఏపీతో పాటు దేశంలోని పలు రాష్టాల్లో బీసీ జనగణనతో పాటు రిజర్వేషన్ల చర్చ కూడా జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన ఇవ్వాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. అలాగే ఏపీలో బీసీల మద్దతుతో తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా బీసీ సంక్షేమంపై దృష్టిపెట్టడంతో పాటు వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ రాజ్యసభలో ఇదే డిమాండ్ ను కేంద్రానికి వినిపించారు.
దేశంలో షెడ్యూల్డు కులాలు, తెగల జనాభాను లెక్కించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, కానీ వెనుకబడిన కులాలను అన్యాయంగా కుల గణన నుంచి విస్మరించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్ కల్పించలేకపోయాం. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలో వారికి న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్ దక్కలేదని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

దేశ జనాభాలో వెనుకబడిన తరగతులు ప్రజలు 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్ 27 శాతానికే పరిమితమైందని సాయిరెడ్డి కేంద్రానికి తెలిపారు. రిజర్వేషన్ సీలింగ్ 50 శాతం మించి ఉండొచ్చని, ఈ సీలింగ్ను సవరించడం రాజ్యాంగ మౌలిక సూత్రాల ఉల్లంఘన ఏమాత్రం కాబోదంటూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయ స్థానం కూడా అభిప్రాయపడిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. ఈ నేపధ్యంలో వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించడంలో ప్రభుత్వానికి న్యాయపరమైన అవరోధాలు కూడా ఏమీ ఉండబోవన్నారు. కాబట్టి బీసీలకు విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగం, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో వారి జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన అని చర్యలు చేపట్టాలని విజయసాయి రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications