జగన్ సొంత జిల్లాలో చెప్పులతో కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్, వైస్ ఛైర్మన్-షాకింగ్ రీజన్
ఏపీలో సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల మధ్య వార్ ముదిరింది. ఇది కాస్తా బహిరంగంగా దాడులు చేసుకునేవరకూ వెళ్లింది. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం దీనికి వేదికైంది. అభివృద్ధి పనుల వ్యవహారంలో తలెత్తిన వివాదం ఇందుకు కారణమైంది.
ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఇవాళ జరిగింది. ఇందులో వైసీపీ కౌన్సిలర్లుతో పాటు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఖాజా మొహిద్దీన్ కూడా పాల్గొన్నారు. సమావేశం మధ్యలో తన వార్డులో పనులు జరగడం లేదని 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా వైస్ ఛైర్మన్ మొహిద్దీన్ దృష్టికి తెచ్చారు. సొంత పార్టీ కౌన్సిలర్ విమర్శలతో ఇరుకునపడ్డ వైస్ ఛైర్మన్.. సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా వినలేదు. దీంతో వివాదం ముదిరింది.
అభివృద్ధి పనుల విషయంలో ప్రశ్నించినా సొంత పార్టీ వైస్ ఛైర్మన్ మొహిద్దీన్ పట్టించుకోవడం లేదనే అక్కసుతో ఇర్ఫాన్ ఖాన్ ఆయనపై చెప్పులువిసిరారు. దీంతో ప్రతిగా వైస్ ఛైర్మన్ మొహిద్దీన్ కూడా తన చెప్పును విసిరి కొట్టారు. ఇలా వీరిద్దరూ చెప్పులు విసురుకోవడంతో కౌన్సిల్ సమావేశం కాస్తా గందరగోళంగా మారింది.
వీరిని నియంత్రించేందుకు సభ్యులు ప్రయత్నించినా చాలా సేపు వినలేదు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. చివరికి పార్టీ నేతలు నచ్చజెప్పి అక్కడి నుంచి ఇద్దరినీ పంపించారు. సీఎం సొంత జిల్లాలో వైసీపీ నేతల మధ్యవివాదాలు ఇలా రచ్చకెక్కడం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.