కాపు రాజకీయాల చిచ్చు-పవన్ అస్త్రాన్నే వాడుకుంటున్న వైసీపీ-అయోమయంలో రాధా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. తాజాగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు కక్కే క్రమంలో ఆయన చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు టీడీపీతో జనసేన పొత్తు ప్రయత్నాలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ విషయాన్నిత్వరగానే గ్రహించిన వైసీపీ మంత్రులు అదే అస్త్రంతో పవన్ పై దాడికి దిగుతున్నారు. దీనికి సమాధానం ఎంత త్వరగా వెతుక్కుంటారనే దానిపై టీడీపీ-జనసేన పొత్తు ఆధారపడే అవకాశాలున్నాయి.
టీడీపీ-జనసేన పొత్తు ప్రయత్నాలు
ఏపీలో టీడీపీ-జనసేన మధ్య మరోసారి పొత్తు పొడిచేందుకు సర్వం సిద్ధమవుతోంది.ఇప్పటికే విశాఖ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన చంద్రబాబు ఆయనకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా విపక్షాలు ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరాన్ని సైతం గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమనే అంచనాల్లోకి ఇరు పార్టీలతో పాటు అధికార వైసీపీ నేతలు కూడా వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కాపు సమీకరణాలు తెరపైకి వచ్చేస్తున్నాయి. వీటిని వాడుకుంటూ ఇరుపార్టీల మధ్య పొత్తుకు బ్రేక్ వేసే ప్రయత్నాలు కూడా ఊపందుకుంటున్నాయి.
కాపు సమీకరణాల్ని కెలుకుతున్న వైసీపీ !
ఓవైపు టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని మాకు ఎప్పుడో తెలుసంటున్న వైసీపీ మంత్రులు.. మరోవైపు కాపు సమీకరణాల్ని తెరపైకి తెచ్చి ఈ కూటమిని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇందుకోసం ఎప్పుడో ముగిసిపోయిన విషయాలతో పాటు కొత్త విషయాల్ని సైతం తెరపైకి తెస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కచ్చితంగా వీటిపై స్పందించాల్సిన పరిస్దితులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహిస్తున్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్ధాయిలో జనసేనలోని కాపు నేతల్ని యాక్టివ్ చేస్తున్నారు.తాజాగా వైసీపీ కాపు మంత్రుల భేటీ తర్వాత ఈ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
పవన్ అస్త్రంతోనే ఎదురుదాడి
ఆ మధ్య మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలతో భేటీలో పవన్ కళ్యాణ్ వైసీపీ కాపు మంత్రులపై బూతులతో రెచ్చిపోయారు. అదే సమయంలో రంగాను కాపాడుకోలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తద్వారా కాపుల్ని ఏకం చేసేందుకు పవన్ ఓ రాయి విసిరారు. కానీ దాని వల్ల కాపుల్లో ఐక్యత ఏమేరకు పెరిగిందో తెలియదు కానీ వైసీపీ మాత్రం దాన్ని ఒడిసి పట్టేసుకుంది. ఇప్పుడు అదే రాయితో పవన్ ను కొట్టేందుకు సిద్ధమవుతోంది. రంగా హత్యపై పవన్ కళ్యాణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని, రంగాపై అంత ప్రేమ ఉంటే ఆయన్ను హత్య చేసిన పార్టీతో పొత్తుకు ఎలా సిద్ధమవుతున్నారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో పవన్ ఆత్మరక్షణలో పడుతున్నారు.
రాధా నోరువిప్పితేనే ?
అయితే గతంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరే క్రమంలో వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా ఓ క్లారిటీ ఇచ్చారు. టీడీపీలో ఎవరో కొందరు చేసిన తప్పుకు అందరినీ బాధ్యుల్ని చేయలేమంటూ కొత్త లాజిక్ తెరపైకి తెచ్చారు. తద్వారా తన తండ్రిని హత్య చేసిన పార్టీలోకి ఆయన చేరికను అలా సమర్ధించుకున్నారు. కానీ ఇప్పుడు జనసేన-టీడీపీ మధ్య పొత్తు కుదురుతున్న నేపథ్యంలో వైసీపీ ఇదే అంశాన్ని ప్రశ్నిస్తోంది. దీంతో ప్రస్తుతం టీడీపీలో ఉంటూ జనసేనతో పొత్తును బలంగా కోరుకుంటున్న రాధా ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కానీ ఓసారి రాధా దీనిపై స్పందిస్తే మాత్రం వైసీపీ కచ్చితంగా ఆత్మరక్షణలో పడక తప్పదు.