రాజధానుల కోసం రాజీనామాల దిశగా - వైసీపీ నేతల కొత్త కార్యాచరణ..!!
విశాఖ పరిపాలన రాజధాని సాధన దిశగా ఏకంగా మంత్రులే రంగంలోకి దిగేందుకు సిద్దమయ్యారు. ఇందు కోసం తమ పదవులకు రాజీనామాలకు రెడీ అయ్యారు. సీనియర్ మంత్రి ధర్మాన ఇప్పటికే తాను విశాఖ రాజధాని కోసం ఉద్యమంలోకి వెళ్లేందుకు వీలుగా తన రాజీనామా అనుమతించాలని సీఎంను కోరారు. కానీ, సీఎం రాజీనామా అవసరం లేదంటూ వారించారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి అనుమితిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి రాజధాని ఉద్యమంలో పాల్గొనాలని ఉందని వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తన రాజీనామా లేఖను జేఏసీ నేతలకు అందించారు.
ఇప్పుడు తాజాగా మరోసారి మంత్రి ధర్మాన సీఎం ను కలిసి రాజీనామా చేస్తానని చెప్పటంతో ఈ ప్రభావం ఉత్తరాంధ్ర వైసీపీ నేతల పైన స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు అమరావతి రైతుల పాదయాత్ర మరి కొద్ది రోజుల్లో విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ యాత్రను ఆ ప్రాంత నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఇక..మంత్రులు ఈ యాత్రకు పోటీగా పాదయాత్ర చేయాలనే ప్రతిపాదన పైన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రులుగా ఉంటూ పాదయాత్రలు చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది..అదే సమయంలో కొత్తగా రాజకీయంగా విమర్శలకు అవకాశం ఏర్పడుతుందా అనే కోణంలో చర్చలు చేస్తున్నట్లు సమాచారం.
ఇక, అమరావతి రైతుల పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించి తమ నిరసన తెలపాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహించే సమయంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో బంద్ పాటించి తమ నిరసన తెలపాలన్నారు. విశాఖ ను రాజధానిగా చేయకుండా అడ్డుకొనేందుకే ఈ పాదయాత్ర అనే ప్రచారం తీవ్రతరం చేసారు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా ఏర్పటైన నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కొత్త కార్యాచరణ ప్రకటించేందుకు రంగం సిద్దమైంది. అందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులతో కలిసి విశాఖ రాజధాని డిమాండ్ తో పాదయాత్ర చేయటమా..లేక, స్థానికుల సహకారంతో నిరసన వ్యక్తం చేయటమా అనే అంశం పైన చర్చలు సాగుతున్నాయి.
ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు సుప్రీంకోర్టు ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారం పైన నవంబర్ 1న విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని త్వరలోనే ఉత్తరాంధ్ర మంత్రులు తమ కార్యచరణ ప్రకటించనున్నారు.