రఘురామ అరెస్టు అందుకే- వైసీపీకీ, ప్రభుత్వానికీ సంబంధం లేదన్న ఎమ్మెల్యే పార్ధసారధి
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ అధికార పార్టీ నేతలు తలోరకంగా స్పందిస్తున్నారు. ఉదయం నుంచీ నరసాపురం ఎంపీ స్దానం పరిధిలోకి వైసీపీ ఎమ్మెల్యేలు రఘురామ అరెస్టును సమర్ధించగా.. కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్దసారధి మాత్రం దీనికి పార్టీకీ ఎలాంటి సంబంధం లేదన్నారు.
రఘురామకృష్ణంరాజు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, కొన్ని కులాల మధ్య ద్వేషభావాన్ని పెంచడానికి ప్రయత్నించారని పెనమలూరు ఎమ్మెల్యే పార్దసారధి ఆరోపించారు. ప్రభుత్వం మీద ప్రజల్లో ఏదో విధంగా ద్వేష భావం చొప్పించాలని రఘురామ ప్రయత్నించినట్లు ఆయన పేర్కొన్నారు. రఘురామ చర్యలు ప్రభుత్వాన్ని అస్ధిరపరచడానికి, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కాదా అని పార్దసారధి ప్రశ్నించారు.
రఘురామకృష్ణంరాజు తన సొంత నియోజకవర్గానికి వెళితే పది మంది కూడా రాని పరిస్ధితులు ఉన్నాయని పార్ధసారధి విమర్శించారు. అంతలా ప్రజలు రఘురామరాజును అసహ్యించుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారనే విషయం ఇంకా రఘురామరాజుకు అర్దం కావడం లేదన్నారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకూ, రాజద్రోహ పనులకు పాల్పడుతూ నాయకుడిని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టే రఘురామరాజును అరెస్టు చేశామన్నారు. రఘురామ అరెస్టుకూ, ప్రభుత్వానికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.