అధికారులకు వణుకు పుట్టిస్తోన్న చంద్రబాబు అవినీతి, పుష్కరాల్లోను దోపిడి : పార్థసారధి
విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున్న అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష వైసీపీ నేతలు. తాజాగా కృష్ణా పుష్కర పనులకు సంబంధించి ప్రభుత్వ పనితీరును తప్పబట్టిన కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పార్థసారధి సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా పుష్కర పనుల్లో ప్రభుత్వ అవినీతి అధికారులకే వణుకు తెప్పిస్తోందని ఎద్దేవా చేసిన ఆయన, కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను ఎలాంటి అనుమతులు లేకుండానే తమకు నచ్చిన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. టెండర్లు లేకుండా కేవలం నామినేషన్ విధానంలో కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే పనుల ప్రారంభంలో ఆలస్యం చేశారని టీడీపీ నేతలపై ఆరోపణ చేశారు.
ఇది నిబంధనలకు విరుద్దమని అధికారులు అభ్యంతరం చెప్పినా..! సీఎం చంద్రబాబు అధికారులనే బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాలకు ముఖ్య వేదికైన విజయవాడ దుర్గఘాట్ పనులను ఇప్పటివరకు పూర్తి చేయలేదని, పనులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, తీరా.. ఇప్పుడు సమయం లేదంటూ కోట్ల రూపాయల పనులను తమ ఇష్టారాజ్యంగా కట్టబెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు పార్థసారధి.
సాంప్రదాయాల సంగతి పక్కనబెట్టి దోచుకోవడం కోసమే ప్రభుత్వం కృష్ణా పుష్కరాలను చేపడుతోందంటూ విమర్శించారు పార్థసారధి. గత గోదావరి పుష్కరాల సమయంలో 30 మంది చనిపోవడానికి కారణమైన ప్రభుత్వం.. తాజాగా కృష్ణా పుష్కరాల కోసం 30 గుళ్లను కూల్చి వేసిందని మండిపడ్డారు.
వట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనల కోసమే ప్రభుత్వం రూ.75 కోట్లను ఖర్చు చేయడం, ఓవైపు ఆఫీసుల్లో కుర్చీలు లేవు, ఫ్యాన్లు లేవు, ఆర్థిక లోటు అని చెప్పుకుంటూనే మరోవైపు పుష్కరాల్లో చేతి ఖర్చుల నిమిత్తం రూ.50 కోట్లు విడుదల చేయడమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. కనీసం ఆ రూ.50 కోట్లను ఏవిధంగా ఖర్చు చేస్తారనే దానిపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదన్నారు.
గత గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయి నేటికి ఏడాది గడిచినా.. ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ నివేదిక మాత్రం ఇంతవరకు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక గోదావరి జలాలను మళ్లించి కృష్ణా పుష్కరాలు నిర్వహించడంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయన్న ఆయన, ప్రభుత్వం ఆ అపోహలను నివృత్తి చేయాలన్నారు.