జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యే కూతురు ! తనకు టికెట్ రాదని తేలిపోవడంతో..!
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు ఎన్నికల వేళ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈసారి తమకు టికెట్ రాదని తేలిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. ఇన్నాళ్లూ సీఎం జగన్ చెప్పినట్లు జనంలో తిరిగామని, ఏం చెప్పినా తూచా తప్పకుండా విన్నామని, అయినా ఇప్పుడు కీలక సమయంలో టికెట్ లేదని చెప్పేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యుల్ని ఇతర పార్టీల్లోకి పంపి టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాకినాడ జిల్లాలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులో భాగంగా ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం ఎమ్మెల్యేగా పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో పిఠాపురం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుకు మొండిచేయి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దొరబాబు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా తన కుమార్తె ఆశ్రితను పిఠాపురం నుంచి బరిలోకి దింపేందుకు సిద్దమవుతున్నారు. అయితే వైసీపీ నుంచి సాధ్యం కాదు కాబట్టి విపక్ష జనసేనలోకి పంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

రెండు , మూడు రోజుల్లో జనసేనలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కుమార్తె ఆశ్రిత సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆశ్రిత ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అనంతరం పిఠాపురం జనసేన అభ్యర్ధిగా ఆశ్రితను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు పిఠాపురం హాట్ సీటుగా మారింది. ఇక్కడి నుంచి పోటీకి పవన్ తో పాటు మెగా కుటుంబానికి సన్నిహితుడైన నిర్మాత బన్నీవాసు పేర్లను పరిశీలిస్తు్న్నారు. ఆశ్రిత చేరితే ఆమెకే టికెట్ దక్కే అవకాశముంది.












Click it and Unblock the Notifications