పార్లమెంట్ సమావేశాలకు పక్కా ప్లాన్ తో వైసీపీ; పార్లమెంటరీ పార్టీ భేటీలో జగన్ ఏం చెప్పారంటే!!
నవంబర్ 29వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో వైసిపి ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైయస్సార్సీపి పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించింది. ఈ భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రధానంగా ఏ అంశాలను లేవనెత్తాలి అన్న విషయాలపై ఎంపీలతో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ఈ పార్లమెంటు సమావేశాలలో రాష్ట్ర సమస్యలను ప్రధానంగా ప్రస్తావించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు పరిష్కరించడం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.
గేరు మార్చిన విశాఖ ఉక్కు ఉద్యమం: సాగు చట్టాల రద్దుతో జోష్.. జగన్ కు లేఖ; ప్లాన్ ఇలా!!
పార్లమెంట్ సమావేశాలపై సీఎం జగన్ దిశా నిర్దేశం
పార్లమెంటు సమావేశాలలో పలు అంశాలపై ఏవిధంగా స్పందించాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారని భేటీ అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. తాము ఏ కూటమిలోనూ లేమని, తమది ప్రజల కూటమి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారని,రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ వేదికగా గళాన్ని వినిపించాలి అని జగన్ సూచించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను నిలబెట్టేలా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో వ్యవహరించాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో జగన్ లేవనెత్తిన అంశాలు పార్లమెంట్ లో
దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ మీటింగ్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేవనెత్తిన ఆరు ప్రధాన అంశాలను పార్లమెంట్ సమావేశాల సమయంలో లేవనెత్తుతామని, కేంద్ర సర్కార్ ని గట్టిగా ప్రశ్నిస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు. పోలవరం నిర్మాణ ఖర్చు 55 వేల కోట్ల రూపాయలు ఆమోదం పొందేలా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. జాతీయ ప్రాజెక్టులో సాగునీరు, విద్యుత్తు కలిపి చూడాలని కోరుతామని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు.
విభజన చట్టంలోని హామీల కోసం, వరద బాధితుల సహాయం కోసం పోరాటం
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆహార భద్రతా చట్టం ద్వారా ఏపీకి అన్యాయం జరుగుతోందని పేర్కొన్న ఆయన ఆహార భద్రత చట్టం పై అనేక విషయాలను పార్లమెంటు ఉభయ సభల్లోనూ లేవనెత్తుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదల కారణంగా అతలాకుతలమైంది అని, వరద బాధితులకు తాత్కాలికంగా వెయ్యి కోట్ల రూపాయల సహాయం కావాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారని, ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని పేర్కొన్న విజయసాయిరెడ్డి పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడతామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని పేర్కొన్న ఆయన, దానిని లాభాల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
Recommended Video
స్టీల్ ప్లాంట్ అంశం, ప్రతేయ్క హోదా అంశం.. పక్కా ప్లాన్ తో వైసీపీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఇక బీసీ జనగణన విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేశామని, ఈ అంశంపై కూడా కేంద్రంతో ప్రస్తావిస్తామని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని చెప్పిన విజయసాయిరెడ్డి, ఈసారి పార్లమెంటు సమావేశాలలోనూ ప్రత్యేక హోదా అంశం పైన పోరాటం సాగిస్తామని తేల్చి చెప్పారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం 30 వేల కోట్ల రూపాయలను ఇవ్వాలని పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలకు పక్కా ప్లాన్ తో వెళ్ళనున్నామని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.