బాలినేని, వైవీ సుబ్బారెడ్డిల మధ్య రాజీ, ప్రకాశంలో పట్టుకోసం వైసీపీ ప్లాన్
తమకు పట్టున్న జిల్లాలో వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలను కైవసం చేసుకొనేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు పక్కా వ్యూహారచన చేస్తోంది.
ఒంగోలు: తమకు పట్టున్న జిల్లాలో వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలను కైవసం చేసుకొనేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు పక్కా వ్యూహారచన చేస్తోంది. ప్రకాశం జిల్లాలో 2019 ఎన్నికలకు ఇప్పటినుండి ఆ పార్టీ పథకరచనచేస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పూర్తిస్థాయిలో ఒంగోలులో పార్టీ కోసం కేటాయించనున్నారు.
ప్రకాశం జిల్లాలో వైసీపీకి పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ ఆరు అసెంబ్లీ స్థానాలను దక్కించుకొంది. అంతేకాదు ఎంపీ స్థానం కూడ కైవసం చేసుకొంది. మరో వైపు అత్యధికంగా జడ్ పి టీసీ స్థానాలను కైవసం చేసుకొన్నా జడ్ పి పీఠం ఆ పార్టీకి దక్కలేదు.
అయితే రానున్న రోజుల్లో ఈ పరిస్థితి రాకూడదని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ నుండి విజయం సాధించిన ఆరు ఎమ్మెల్యేలలో నలుగురు టిడిపిలో చేరారు. దరిమిలా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు క్యాడర్ ను సిద్దం చేసేందుకు వైసీపీ ప్లాన్ చేసింది.
ఒంగోలులోనే పూర్తికాలం పార్టీ పనులకోసం కేటాయించాలని వైసీపీ చీప్ జగన్ ఆదేశించారు. పార్టీ ప్లీనరీ నాటికిజిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్షలు పూర్తిచేయనున్నారు.
బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై వైసీపీ కసరత్తు
ప్రకాశం జిల్లాలో పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ఆ పార్టీ ప్రత్యేకంగా కేంద్రీకరించాలని నిర్ణయం తీసుకొంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలను చేపట్టనున్నారు. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో పార్టీల బలాన్ని తేల్చేందుకుగాను సర్వే సంస్థలను ఆ పార్టీ రంగంలోకి దింపింది. అంతేకాదు రానున్న ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థులుగా బరిలోకి దింపితే పార్టీకి ప్రయోజనమే విషయాలపై కూడ పార్టీ చర్చిస్తోంది.
టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్లీనరీలపై ప్రత్యేక శ్రద్ద
ప్రకాశం జిల్లాలోని ఆరుగురు ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు టిడిపిలోచేరారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ నియోజకవర్గాల ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.
పరిస్థితులను చక్కదిద్దనున్న నాయకత్వం
కొండపి నియోజకవర్గంలో పార్టీలో నాయకుల మధ్య బహిర్గతమైన విభేదాలు, కనిగిరి వంటి చోట్ల పార్టీ ఇన్ చార్జిలకు కొందరు నాయకులు సహాకరించకపోవడం వంటి అంశాలపై వైసీపీ నాయకత్వం కేంద్రీకరించనుంది.ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంపై కూడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కేంద్రీకరించి పనిచేయనున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఆయన పోటీచేసి ఓటమిపాలయ్యారు.హైద్రాబాద్ నుండి ఆయన తన మకాంను ఒంగోలుకు మార్చినట్టు సమాచారం.
వారి మద్య విబేధాలు పార్టీకి నష్టమే
ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల మధ్య ఉన్న అగాధం కూడ పార్టీకి నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పార్టీచీప్ జగన్ ఇద్దరి మద్య సఖ్యత కోసం ప్రయత్నించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. దీంతో జిల్లాలో పార్టీ నాయకత్వబాధ్యతలను బాలినేనికి పార్టీ అప్పగించిందనే సమాచారం.ఈ మేరకు జిల్లాల్లో నియోజకవర్గాలవారీగా పార్టీ ప్లీనరీ ఏర్పాట్ల విషయమై జిల్లా నాయకులతో ఆయన ఫోన్ లో చర్చించారని పార్టీవర్గాలు తెలిపాయి.