మూడు రాజధానుల్ని సుప్రీం వద్దంటే ? ప్లాన్ బీ రెడీ చేస్తున్న వైసీపీ ? కొడాలి హింట్ !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని ఒకవేళ సుప్రీంకోర్టు వద్దంటే అప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మూడు రాజధానులపై పార్లమెంటులో చట్టం చేయించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో అమరావతి స్ధానంలో తెరపైకి వచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. దీన్ని వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లోపు సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి రాజధానులకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. ఒకవేళ అలా కాకుండా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పునే సమర్ధిస్తే... ఏం జరగబోతోంది..?
సుప్రీంలో మూడు రాజధానుల కేసు
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. మరోవైపు త్వరలో కాబోయే రాజధాని విశాఖకు వెళ్తున్నానంటూ సీఎం జగన్ తాజాగా ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టు ఆ లోపు తీర్పు ఇవ్వబోతోందా ? ఇస్తే అందులో అమరావతిని సమర్ధిస్తుందా లేక మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తుందా అనేది తేలాల్సి ఉంది. పలు సంక్లిష్ట అంశాలతో కూడిన రాజధాని వ్యవహారాన్ని సుప్రీంకోర్టు కూడా అంత త్వరగా తేల్చడం సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు. అయినా ఎందుకైనా మంచిదన్న ధోరణితో వైసీపీ సర్కార్ ముందస్తు వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మూడు రాజధానుల్ని సుప్రీం వద్దంటే ?
వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్ని ఎట్టి పరిస్దితుల్లోనూ ఈ ఏడాది అమల్లోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. అదే సమయంలో ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. దీన్ని అంత సీరియస్ గా తీసుకోనట్లే కనిపిస్తోంది. దీంతో విచారణ కూడా పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే విచారణ మరో రెండునెలల్లో పూర్తయి సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పుకు రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా మందుగానే ప్రిపేర్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే మూడు రాజధానుల్ని సుప్రీంకోర్టు సమర్ధిస్తే సరి, లేకుంటే ఏం చేయాలనే దానిపై వైసీపీ ప్లాన్ బీ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్లాన్ బీ ఇదే ?
ఒకవేళ సుప్రీంకోర్టు మూడు రాజధానుల్ని వద్దంటే వైసీపీ ప్లాన్ బీ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న ఈ వ్యవహారంపై మాట్లాడిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని సంకేతాలు ఇచ్చేశారు. సుప్రీంకోర్టు మూడు రాజధానుల్ని వద్దంటే ఏం చేయాలనుకుంటున్నారో కొడాలి నాని చెప్పేశారు. ఒకవేళ సుప్రీం రాజధానులు వద్దంటే కేంద్రంపైనే ఒత్తిడి తెచ్చి మూడు రాజధానుల బిల్లు పెట్టిస్తామంటూ కొడాలి హింట్ ఇచ్చేశారు. దీంతో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుని అయినా మూడు రాజధానుల్ని అమలు చేయించే దిశగా వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.
కేంద్రంలో వైసీపీ మద్దతు వారికే ?
సుప్రీంకోర్టు మూడు రాజధానుల్ని వద్దని చెప్పిన తరుణంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అసెంబ్లీ అధికారాలపై చట్ట సవరణ చేయించేందుకు సీఎం జగన్ ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు ప్రైవేట్ బిల్లు పెట్టారు. దీన్ని అధికారికంగా బీజేపీయే సమర్ధిస్తే అప్పుడు పరిస్ధితి పూర్తిగా మారిపోవడం ఖాయం. బీజేపీ తమ రాజకీయ విధానంలో భాగంగా మూడు రాజధానుల్ని కాదని అమరావతికే మద్దతిస్తే అప్పుడు రాబోయే ఎన్నికల్లో మూడు రాజధానులకు మద్దతిచ్చే పార్టీలకే తమ మద్దతు ప్రకటించేందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే విచిత్రంగా బీజేపీతో పాటు ప్రధాన విపక్షం కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయమంటూ తెరపైకి వస్తున్న బీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా ఈ విషయంలో అమరావతికే మద్దతిస్తుండటం వైసీపీకి ఇబ్బందులు సృష్టించే అవకాశముంది.