జగన్ను లెక్క చేయని ఎమ్మెల్యేలు- ఏడాదిలోనే మారిన పరిస్ధితి- రఘురాముడే మార్గదర్శి...
ఏడాది క్రితం సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయంతో పగ్గాలు అందుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై తనదైన ముద్ర వేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే వైసీపీపై అంతకు ముందున్న చెడ్డపేరును పోగొట్టేలా వ్యవహరించాలని, కనీసం ఏడాదిపాటైనా సంయమనం పాటించాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ సూచించారు.
అయితే ఇప్పుడు ఏడాది పూర్తయిందన్న లాజిక్కో, తామేం చేసినా పట్టించుకునే తీరిక జగన్కు లేదన్న ధీమానో తెలియదు కానీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నారు. వీరిలో కొందరు జగన్ సామాజిక వర్గమైన రెడ్లపైన, మరికొందరు జగన్కు ఆప్తులైన పార్టీ ఇన్ఛార్జ్లపైన తిరుగుబాటు చేస్తుంటే, ఇంకొందరు మంత్రులను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడికి వెళుతుందో అన్న ఆందోళన సాధారణ కార్యకర్తల్లో పెరుగుతోంది.
వైసీపీ అసంతృప్త స్వరాలు...
ఏపీలో ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకున్న అధికార వైసీపీకి ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే ధిక్కార స్వరాలు తప్పడం లేదు. ముఖ్యంగా ఎంపీ రఘురామరాజుతో మొదలైన అసంతృప్త స్వరాలు ఇప్పుడు ఎమ్మెల్యేలకు, కింది స్ధాయి నేతలకూ పాకాయి. వీరిలో ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎవరిని టార్గెట్ చేసుకుంటారో ఎవరికీ తెలియని పరిస్ధితి. తాజాగా విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు చేసిన విమర్శలు చూస్తుంటే వైసీపీలో నెలకొన్న అసంతృప్తి సెగలు ఏ స్ధాయిలో ఉన్నాయో ఇట్టే అర్ధమవుతుంది.
అవినీతి రహిత పాలన పేరుతో జగన్ విధించిన ఆంక్షలే ఇందుకు కారణమా, లేక మంత్రులు, ఇన్ఛార్జ్ల స్ధాయిలో మాత్రమే అనుకున్న పనులు జరుగుతూ తమను లెక్కచేయకపోవడమా అన్నది ఇంకా తేలడం లేదు.
వైసీపీ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్..
అధికారం చేపట్టిన కొత్తలో ఏడాది పాటు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లొద్దని, అవినీతికి దూరంగా ఉండాలని సీఎం జగన్ తన పార్టీ తరఫున గెలిచన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు. అయితే ఏడాది పూర్తయిన తర్వాత కూడా వీరు స్వేచ్ఛగా పని చేసుకునే పరిస్ధితి లేదని మెజారిటీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం ప్రతీ శాఖ, విభాగంలో ఆన్లైన్ అమలు చేయడమో లేక గ్రామ సచివాలయాలు, వాలంటీర్లపై ఎక్కువగా ఆధారపడటమో జరుగుతోంది.
దీంతో గత ఎన్నికల ముందు వరకూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగిన ప్రజలు ఇప్పుడు వారికి దూరమైపోయారు. ఏదో ఒక పని కోసం నేతల వద్దకు జనం వస్తేనే కాస్తో కూస్తో సంపాదించుకోవచ్చని భావించే పరిస్ధితుల్లో జగన్ అంతా సచివాలయమే, వాలంటీర్లే అనడం వారిలో అసంతృప్తి పెంచుతోంది. ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలయ్యాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించుకోవాలన్న ప్రశ్న వారిలో వినిపిస్తోంది. దీంతో సహజంగానే ఈ అసంతృప్తి పలు రూపాల్లో బయటికొస్తోంది.
రఘురామరాజు తిరుగుబాటే ఆదర్శం...
వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఏడాది తిరక్కముందే సొంత పార్టీపై అసమ్మతి పోరు ప్రారంభించారు. నిత్యం పార్టీలో కీలకనేతలతో పాటు ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మధ్యలో వైసీపీ నేతలు వేసే విగ్గురాజా సెటైర్లకు దీటుగా బదులిస్తూ సై అంటే సై అనేలా తయారయ్యారు. కానీ రఘురామరాజుపై ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్ధితుల్లో వైసీపీ నిలిచింది.
లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ అనర్హత వేటు దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఈ ప్రభావం ఇతర నేతలపై పడుతోంది. రఘురామరాజును ఏమీ అనలేని సీఎం జగన్ తమను మాత్రం అంటారా అనే ధీమా ప్రజాప్రతినిధుల్లో పెరుగుతోంది. దీంతో రఘురామ తరహాలోనే ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానే అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నారు.
Recommended Video
జగన్కు భారంగా జోడు స్వారీ....
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉన్న జగన్కు గతేడాది నుంచి సీఎం బాధ్యత కూడా అదనంగా వచ్చి చేరింది. దీంతో ఇప్పుడు సీఎంగా ఉంటూనే పార్టీ వ్యవహారాలు చూసుకోవాల్సిన పరిస్ధితి. అసలే అదను కోసం పొంచి ఉన్న ప్రత్యర్ధులు. న్యాయస్ధానాలు, కేసులు, వివాదాలు వీటికి అదనం. ఇలా పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఏకకాలంలో నడపాల్సిన పరిస్ధితుల్లో జగన్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
పార్టీలో నంబర్ టూ అంటూ ఎవరూ లేకపోవడంతో జగన్కు జోడు స్వారీ తప్పడం లేదు. మధ్యలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలను సీనియర్ నేతల్లో ఒకరికి అప్పగించి తాను సీఎం పదవికి పరిమితం కావాలని భావించినా సాధ్యం కాలేదు. ఎమ్మెల్యేలతో భేటీ అయి వారి అభిప్రాయాలు తీసుకుందామన్నా కుదరలేదు. దీంతో ఇప్పుడు ఈ జోడు స్వారీ జగన్కు సమస్యగా మారింది. దీన్ని అధిగమించడంలో జగన్ చూపే చొరవే వైసీపీ భవిష్యత్తును నిర్ణయించబోతోందంటే అతిశయోక్తి కాదు.