పార్టీ అధినేతను, హాజరుకాలేను: సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్
హైదరాబాద్: సీబీఐ కోర్టులో వైసీపీ అధినేత వైయస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల విషయంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో విచారణ నిమిత్తం తనకు బదులుగా కోర్టులో హాజరయ్యేందుకు లాయర్ జి.అశోక్ రెడ్డిని అనుమతించాలంటూ శుక్రవారం వైయస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, వైసీపీ అధ్యక్షుడిగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సి వస్తోందని అందులో పేర్కొన్నారు. జగన్ వేసిన పిటిషన్పై గతంలో సీబీఐ కౌంటర్లు దాఖలు చేసినప్పటికీ, జగన్ అభ్యర్ధనపై పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు కోట్టివేసింది.
తాజాగా మళ్లీ జగన్ వేసిన పిటిషన్లో వాటిని కొట్టివేయాలని కోరారు. ఇదిలా ఉంటే జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన వాన్ పిక్ కేసులో నిందితుడిగా ఉన్న ఐఆర్ఎస్ అధికారి కెవీ బ్రహ్మానందరెడ్డి పెట్టుకున్న డిశ్చార్జి పిటిషన్ను సీబీఐ కోర్టు శుక్రవారం కొట్టివేసింది.
ఈ కేసు నుంచి తన పేరుని తొలగించాలంటూ బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పై మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలను విన్న సీబీఐ కోర్టు ప్రాథమిక ఆధాలున్నందువల్ల ఈ పిటిషన్ ను అనుమతించలేమని పేర్కొంది.
అయితే కెవీ బ్రహ్మానందరెడ్డి మాత్రం తానేమని వ్యక్తిగతంగా లబ్ధి పోందలేదని, కేవలం కేబినెట్ నిర్ణయాలను మాత్రమే అమలు చేశానని పేర్కొన్నారు. అప్పట్లో మౌలిక వసతుల శాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన వాన్ పిక్ ప్రాజెక్టులకు లబ్ధి చేకూరేలా వ్యవహారించారని సీబీఐ పేర్కొంది.
ఇరు వాదలను విన్న కోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కెవీ బ్రహ్మానందరెడ్డి పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.