అవిశ్వాసానికి 150 మంది మద్దతు: వైసీపీ, టిడిపి నిరసనకు రేణుకా సంఘీభావం
Recommended Video
న్యూఢిల్లీ: కేంద్రంపై సోమవారం నాడు అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాలేదు. దీంతో మరోసారి వైసీపీ సోమవారం నాడు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. మరోసారి టిడిపి కూడ నోటీసు ఇవ్వనుంది. అయితే పార్లమెంట్ ఆవరణలో టిడిపి సభ్యుల ఆందోళనలకు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మద్దతును ప్రకటించారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ సభ్యులు ఆరోపణలు చేశారు..
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో కేంద్ర ప్రభుత్వం పై వైసీపీ, టిడిపిలు అవిశ్వాస తీర్మానాల నోటీసులు ఇచ్చాయి. ఇప్పటికే రెండు దఫాలు ఈ తీర్మానాలపై చర్చలు జరగలేదు. వైసీపీ మరోసారి సోమవారం నాడు అవిశ్వాస నోటీసును ఇచ్చింది.
పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే వరకు తాము నోటీసులు ఇస్తామని ఆ పార్టీ ఎంపీలు ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాటం చేస్తామని ఆ పార్టీ ఎంపీలు ప్రకటించారు.
150 మంది ఎంపీలు మద్దతిచ్చారు
కేంద్రంపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానానికి అనుహ్య మద్దతు లభించిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. స్పీకర్ అవిశ్వాస తీర్మాననోటీసులు అందాయని ప్రకటించిన తర్వాత 150 మంది ఎంపీలు లేచి నిలబడ్డారని ఆయన చెప్పారు.అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు రాకుండా ఎన్డీఏ అడ్డుకొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలను ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారని ఆయన చెప్పారు.
టిడిపి ఎంపీల నిరసనకు రేణుకా చౌదరి మద్దతు
టిడిపి ఎంపీల నిరసనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి మద్దతును ప్రకటించారు. రాష్ట్ర హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా తాము పోరాటం చేస్తున్నామని రేణుకా చౌదరి చెప్పారు. పార్లమెంట్ వెలుపల టిడిపి ఎంపీలు నిరసనలు తెలిపే సమయంలో అక్కడకు వచ్చిన రేణుకా చౌదరి వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. అదే సమయంలో మహిళ వేషధారణలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిరసన తెలిపారు. శివప్రసాద్కు రేణుకా చౌదరి మద్దతుగా నిలిచారు. ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నామని రేణుకా చౌదరి చెప్పారు.
ఎన్డీఏ ప్రభుత్వం అనుకొంటేనే చర్చ
ఎన్డీఏ ప్రభుత్వం అనుకొంటేనే అవిశ్వాసంపై లోక్సభలో చర్చకు వచ్చే అవకాశం ఉందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చిన్నపాటి గందరగోళానికి కూడ సభను వాయిదా వేస్తున్నారని ఆయన చెప్పారు. కానీ, సభలో తీవ్రమైన గొడవ జరుగుతున్న సమయంలో కూడ ద్రవ్య వినిమయ బిల్లును కూడ ప్రభుత్వం ఆమోదం పొందేలా చేసిందని ఆయన చెప్పారు. అవిశ్వాసంపై చర్చ కు ప్రభుత్వం సిద్దంగా ఉంటేనే సభలో అవిశ్వాసంపై చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బాబు అనుమతి తీసుకోవాలా
తాను ఎవరిని కలవాలనే విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుమతిని తీసుకోవాలా అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఎవరిని కలిస్తే బాబుకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తోనే తాను పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు.