రఘురామను వీడని కష్టాలు-సుప్రీం బెయిల్ ఇచ్చినా-సోమవారమే విడుదల
రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటూ సుప్రీంకోర్టులో బెయిల్ పొందిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆయనకు సుప్రీంకోర్ట్ బెయిల్ ఇచ్చినా మరో రెండు రోజుల పాటు ఆయన సీఐడీ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్ధితి. ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న రఘురామ సాంకేతికగా సీఐడీ కస్టడీలో ఉన్నట్లే లెక్క.
రఘురామకృష్ణంరాజుపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసులో ఆయనకు సుప్రీంకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. అయితే తీర్పు కాపీ మాత్రం ఇంకా సీఐడీకి కానీ, సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి కానీ అందలేదు. ఇవాళ శనివారం, రేపు ఆదివారం కావడంతో కోర్టులు పనిచేయవు. అలాగే తీర్పు కాపీలు పిటిషనర్లకు అందించేందుకు వీలు కాదు. దీంతో సుప్రీంకోర్టు రఘురామరాజుకు బెయిల్ ఇస్తూ ఇచ్చిన తీర్పు కాపీ సోమవారమే అందే అవకాశం ఉంది.

ఓసారి తీర్పు కాపీ అందిన తర్వాత మాత్రమే సీఐడీ కానీ, సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వర్గాలు కానీ రఘురామరాజు విడుదలకు చర్యలు తీసుకునే అవకాశం లేదు. దీంతో ఆయన సోమవారం వరకూ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్దితి నెలకొంది. రఘురామరాజు జనరల్ ఎడీమాతో బాధపడుతున్నారని, అలాగే కాలికి గాయం కూడా ఉందని ఆర్మీ ఆస్పత్రి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. దీన్ని ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాలి వేలు ఫ్రాక్చర్ తోపాటు ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న రఘురామకృష్ణరాజు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లడంకన్నా ఆస్పత్రిలో ఉండటమే మంచిదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications