రాజీనామా, పార్టీ మార్పు-తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపక్ష వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అంతే కాదు తమ పదవులను కూడా వదులుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు తిరిగి కూటమి పార్టీల తరఫున ఎంపీలుగా ఎన్నికవుతుంటే.. మరికొందరికి మాత్రం నిరాశ తప్పడం లేదు. ఇలాంటి పరిస్దితుల్లో వైసీపీ పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా ఆ పార్టీని కుదిపేసింది. ఆయన తర్వాత మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి క్యూలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంద.
దీనిపై ఇవాళ ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పందించారు. ముందుగా తాజాగా పార్టీని, రాజకీయాల్ని సైతం వీడిన సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించారు. విజయ్ సాయి రెడ్డి బాధ్యత కలిగిన వ్యక్తి అని, కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడు అని అన్నారు.రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటున్నారో విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు.
రాజకీయాలలో వడిదుడుకులు సర్వసాధారణం అన్నారు. రాజకీయాలలో గెలిచినప్పుడు బాగానే ఉంటుందని, ఓడినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయని, అవి తట్టుకొని నిలబడే శక్తి ఉండాలని సాయిరెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లోనే కాదు వ్యాపారాలలో కూడా దీని ప్రభావం ఉంటుందని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. మనిషి జీవితంలో అన్ని రంగాలలో రాణించిన తర్వాతే రాజకీయాల్లోకి రావాలన్నారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని అవి ఎదుర్కొని నిలబడగలగటమే రాజకీయం అన్నారు. మరోవైపు పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టంచేశారు. దీంతో అయోధ్య రామిరెడ్డి రాజీనామా, పార్టీ మార్పు ప్రచారానికి చెక్ పడింది.












Click it and Unblock the Notifications