పృధ్వి పై వైసీపీ హైకమాండ్ సీరియస్: చర్యలకు రంగం సిద్దం: తాజా వ్యాఖ్యల కలకలం..!
ఎస్వీబీసీ ఛైర్మన్..పార్టీ నేత పృధ్వి పై వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా స్పందించింది. తాజాగా అమరావతిలో రాజధాని తరలింపు ప్రతిపాదనలకు నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతుల పైన పృధ్వి చేసిన వ్యాఖ్యలు కలలకలానికి కారణమయ్యాయి. ఆయన కులం పేరుతో వ్యాఖ్యలు చేయటం వివాదంగా మారింది.
దీని పైన వైసీపీలోనే ఉంటున్న..సినీ రచయిత పోసాని సైతం పృధ్వి వ్యాఖ్యల పైన తీవ్రంగా స్పందించారు. ఆ తరువాత కూడా పృధ్వి అదే రకంగా మాట్లాడటంతో పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుంది. ఆయన పైన చర్యలకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. కులాలను ప్రస్తావిస్తూ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదని పార్టీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీని పైన పృధ్వి ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
పృధ్వి పై క్రమశిక్షణ చర్యలు..
పృధ్వి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించింది. జగన్ పాదయాత్ర సమయంలో ఆయనతో కలిసి నడిచిన పృధ్వి కి..జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కీలకమైన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే, ఆ పదవిలో సైతం ఆయన సమర్ధవంతంగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం ఉంది. అక్కడ కొంత మందికి నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగాల కల్పిన పైన టీటీడీ ఛైర్మన్ అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే విధంగా కొత్త కార్యక్రమాల రూప కల్పనలో ఆయన పని తీరు ఆశించిన స్థాయిలో లేదని పార్టీ నేతలే చెబుతున్నారు.
ఇదే సమయంలో రాజధాని రైతుల గురించి పృధ్వి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయనే అంచనాకు పార్టీ నేతలు వచ్చారు. దీని పైన పోసాని స్పందించిన తరువాత మరింతగా వివాదానికి కారణమయ్యాయి. దీంతో..సామాజిక వర్గాల పేర్లతో విమర్శలు చేయటం పైన సీరియస్ గా తీసుకున్న వైసీపీ అధినాయకత్వం..ఇప్పుడు పృధ్వి పై క్రమశిక్షణ చర్యలకు సిద్దం అవుతోంది.
పార్టీకి డామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా..
పృధ్వి అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా..వారి సామాజిక వర్గాన్ని ప్రస్తావించటం..రైతులు బురదలో ఉండాలని వ్యాఖ్యానించటం పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికి నిరసనగా అమరావతి గ్రామాల్లో ఆయన ఫ్లెక్సీని స్థానిక మహిళలు చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేసారు. ఇదే సమంయలో పోసాని స్పందించటంతో మరింత చర్చకు కారణమైంది.
ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళల పైన పృధ్వి ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తారా..సిగ్గుపడాలి అంటూ పోసాని తీవ్రంగా స్పందించారు. ఇక, ఇది జరిగిన తరువాత కూడా తాను అన్న మాటలకే కట్టుబడి ఉన్నానంటూ మరోసారి పృధ్వి వ్యాఖ్యలు చేసారు. దీంతో..పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుంది. క్రమశిక్షణ చర్యలు తప్పవని చెబుతూనే.. కులాలను ప్రస్తావిస్తూ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసింది.